'చిరుతపులి మృతి.. పందిని తినడమే కారణం..!' - latest leopard dead news
leopard dead in chandanapally: చిరుతపులి చనిపోయి విగత జీవిగా పడి ఉంది. ఈ ఘటన నల్గొండ జిల్లా చందనపల్లి గ్రామంలో ఒక చిరుతపులి చనిపోయి పొదల్లో పడి ఉంది. గ్రామంలోని డంప్ యార్డ్ సమీపంలోనీ చెట్ల పొదల్లో మృతి చెందిన చిరుతపులిని స్థానికులు గుర్తించారు. గ్రామస్థులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. గత కొంతకాలంగా కేశరాజుపల్లి, శేషమ్మ గూడెం, ఎస్సీ కాలనీ, చందనపల్లి గ్రామాల్లో చిరుతపులి సంచరించినట్లు అధికారులు గుర్తించారు. చందనపల్లి గ్రామానికి చెందిన ఓ పందుల పెంపకం దారుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు పందులకు మందు పదార్ధాలు పెట్టడం వల్ల సుమారు 20 పందులు చనిపోయాయి. అందులో ఓ పందిని చిరుత తినటం వల్ల అది చనిపోయినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారులు చిరుత మృతికి గల కారణాలను శవ పరీక్ష అనంతరం తెలియజేస్తామని వెల్లడించారు. చిరుతను పోస్టుమార్టమ్ కోసం తరలించారు.