Kunamneni Talk About 2000 Notes Cancel : 'పెద్దనోట్ల రద్దు నిర్ణయం సరైంది కాదు' - తెలంగాణ న్యూస్
Kunamneni Talk About 2000 Notes Cancel : ప్రధాని మోదీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తుగ్లక్ తరహా నిర్ణయంలా ఉన్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనని సాంబశివరావు విమర్శించారు. కొత్తగూడం పట్టణంలో జూన్ 4వ తేదీన ‘సీపీఐ ప్రజా గర్జన’ పేరుతో.. భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లక్ష మందితో జరిగే ఈ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా హాజరవుతారని చెప్పారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం బైటికి తీసుకువస్తామని.. ఉగ్రవాదం రూపుమాపుతామని చేసిన వాగ్దానాలు నిజం కాకపోగా.. నల్లధనాన్ని బడాబాబులు తెల్లధనం చేసుకునేందుకు సహకరించారని పరోక్షంగా ఆరోపించారు.
తాజాగా వాటిని రద్దు చేయడం ద్వారా ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారన్నారు. రాబోయో పార్లమెంటు, శాసనసభ ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీలకు ఆర్థికంగా చక్రబంధం వేసేలా బీజేపీ పన్నాగం కనపడుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు స్థలాలు కేటాయించాలని ప్రభుత్వానికి కూనంనేని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ జర్నలిస్టు సొసైటికీ 15 ఏళ్ల క్రితం కేటాయించిన భూమిని మొత్తం అప్పగించాలని డిమాండ్ చేశారు.