Published : Aug 30, 2023, 6:18 PM IST
Kodikatti Case Updates: కోడికత్తి కేసులో శ్రీనివాస్కు దళిత సంఘాల మద్దతు.. 'న్యాయం జరిగే వరకూ పోరాడుతాం'
Kodikatti Case Updates : కోడికత్తి కేసులో నిందితుడైన జనుపల్లి శ్రీనివాస్కు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని దళిత సంఘాల నేతలు స్పష్టం చేశారు. శ్రీనివాస్ తరఫున వాదిస్తున్న న్యాయవాది సలీమ్ను విశాఖ దళిత సంఘాల ఐక్య వేదిక ఘనంగా సన్మానించింది. విశాఖ కోర్టు సముదాయం వెలుపల డాక్టర్ బూసి వెంకట్రావు, ఇతర దళిత సంఘాల నాయకులు (Dalit communities Leaders) సలీమ్ను అభినందించారు. ఈ సందర్భంగా సలీమ్ మాట్లాడుతూ.. దళితులు జనుపల్లి శ్రీనివాస్కు మద్దతు ఇవ్వడం మంచి పరిణామం అన్నారు. ఒక దళితుడిని నాలుగేళ్లుగా బెయిల్ ఇవ్వకుండా ఇబ్బందుల పాలు చేయడం సరికాదన్న సలీమ్.. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్ఓసీ ఇవ్వాలని, లేదంటే కోర్టుకు హాజరుకావాలని అన్నారు.
కోడికత్తి దాడి కేసులో ముఖ్యమంత్రి కోర్టుకు హాజరు కావాలి. కోర్టుకు వచ్చి తనకు నచ్చినట్టుగా చెప్పుకోవాలి. లేదంటే బెయిల్ ఇవ్వడానికి అభ్యంతరం లేదని చెప్పాలి. శిక్షకు మించి రిమాండ్లో ఉండడం దారుణం. మరోసారి జరిగే వాయిదాకు ముఖ్యమంత్రి హాజరు కావాలని కోరుతున్నాం. - బూసి వెంకట్రావు, దళిత హక్కుల ఐక్య వేదిక కన్వీనర్
కేసు విషయంలో చాలా అన్యాయం జరుగుతోంది. నాలుగేళ్లుగా రిమాండ్లోనే ఉండడం విచారకరం. దళిత సంఘాలు మద్దతుగా నిలవడం సంతోషకరం. కేసు నుంచి శ్రీను బయట పడాలి అంటే పిటిషనర్ విచారణకు హాజరు కావాల్సిందే. కోర్టుకు హాజరైతే బండారం బయట పెడతాం. - సలీమ్, శ్రీనివాస్ తరఫు న్యాయవాది