మహిళా కార్యకర్త అత్యుత్సాహం.. మోదీ వాహనంపైకి ఫోన్ విసిరి.. - ప్రధాని మోదీపైకి ఫోన్ విసిరిన బీజేపీ మహిళ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఓ మహిళా కార్యకర్త అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రచార పర్వంలో భాగంగా రోడ్షోలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ వాహనంపైకి ఆ మహిళ ఫోన్ విసిరారు. చివరకు ఏం జరిగిందంటే?
ప్రధాని మోదీ ఆదివారం మైసూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆ సమయంలో బీజేపీకి చెందిన ఓ మహిళా కార్యకర్త ప్రధాని వైపుగా మొబైల్ ఫోన్ను విసిరారు. అది కాస్త వాహనం బానెట్పై పడింది. అప్పటికే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీజీ) రక్షణలో ఉన్న ప్రధాని.. దానిని గమనించి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీజీ)ను అప్రమత్తం చేశారు.
వెంటనే అలర్ట్ అయిన పోలీసులు ఫోన్ విసిరిన మహిళను గుర్తించి ప్రశ్నించారు. కేవలం మోదీని చూసిన ఆనందంలోనే తాను అలా చేశానని వివరించారు. అనంతరం ఆ ఫోన్ను ఆమెకు అందించారు. ఈ ఘటనలో ఎలాంటి దురుద్దేశం లేదని పోలీసులు వెల్లడించారు. ఈ విషయంపై మేం దర్యాప్తు జరుపుతున్నామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ, విపక్షాల ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. దీంట్లో భాగంగానే శని, ఆదివారాలు పలు ప్రాంతాల్లో మోదీ సభలు, రోడ్షోల్లో పాల్గొన్నారు. మే 13న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
TAGGED:
Phone thrown on modi