Goddess Decoration With Rs.2 crore : రూ. 2కోట్ల 22లక్షల 22వేల 222తో అమ్మవారికి అలంకరణ.. ఎక్కడంటే..? - నోట్లతో అమ్మవారి అలంకరణ
Published : Oct 20, 2023, 3:45 PM IST
Goddess Decoration With Rs.2 crore in Mahabubnagar : దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరిస్తారు. పండ్లు, కూరగాయలు, గాజులు ఇలా వివిధ రకాలుగా అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణవాడిలో వాసవీమాతను మాత్రం నోట్లతో అలంకరించారు. ఏకంగా రూ.2 కోట్లతో అమ్మవారిని, మండపాన్ని మొత్తం డబ్బులతో ముస్తాబు చేశారు. శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు వాసవీమాతను రూ.2 కోట్ల 22 లక్షల 22వేల 222తో అలంకరించారు. రూ.10 నుంచి రూ.500 నోట్లతో అమ్మవారి గర్భాలయంతో పాటు మండపాన్ని కూడా డెకొరేట్ చేశారు.
మరో రూ.10 వేల విలువ కలిగిన ఒక్క రూపాయి నాణెలకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు కానుకగా అందజేశారు. నవరాత్రుల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక హోమంతో పాటు అభిషేకాలు, మహిళలచే కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు గజ వాహనం మీద పల్లకిలో ఊరేగింపు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులందరూ అమ్మవారి అలంకరణ చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఫోటోలు తీస్తూ.. అమ్మవారిని దర్శించుకున్నారు.