గుప్త నిధుల కోసం ఇంట్లో తవ్వకాలు - నిజామాబాద్లో కలకలం రేపిన ఘటన - nizamabad gupta nidhulu
Published : Jan 13, 2024, 5:22 PM IST
Excavation for hidden treasures in Nizamabad :నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని బర్దిపూర్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బర్దిపూర్ గ్రామంలో అద్దెకు ఉంటున్న బోగిపి రాజు అతని కుటుంబీకులు కలిసి ఇంట్లో తవ్వకాలు జరిపారు. బోధన్ రూరల్ ఎస్సై నాగనాథ్ ఆధ్వర్యంలో తవ్వకాలు జరిపిన ఇంటిని పరిశీలించారు. సదరు ఇంటి యజమాని మహేందర్ వల్లే గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు తెలుస్తోంది. తవ్వకాలు జరిపిన వారందరినీ అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.
గుప్త నిధుల కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి శ్రీమన్నారాయణతో పాటు బోధన్కు చెందిన సాయిలును పిలిపించినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్న నేపథ్యంలో పోలీసులు ఇప్పటి కాలంలో కూడా గుప్త నిధులంటూ, మూఢ నమ్మకాలు నమ్మవద్దని సూచించారు. ఇలాంటివి నమ్మి తవ్వకాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.