నీటి కుంటలో పడ్డ ఏనుగులు.. బయటకు రాలేక రాత్రంతా అవస్థలు.. చివరికి..
పొలంలోని నీటి కుంటలో నాలుగు ఏనుగులు చిక్కుకున్నాయి. రెండు పిల్లలతో పాటు మరో రెండు పెద్ద ఏనుగులు కుంటలో పడిపోయాయి. నీటిలో నుంచి బయటకు రాలేక తీవ్ర అవస్థలు పడ్డాయి. నీళ్లలోనే అటు ఇటు తిరుగుతూ బయట పడేందుకు తీవ్రంగా శ్రమించాయి. ఈ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జరిగింది.
సుళ్య మండలం అజ్జవర గ్రామ పరిధి అటవీలోని నాలుగు ఏనుగులు రాత్రి సమయంలో ఆహారం కోసం బయలుదేరాయి. అలా వెళ్తున్న క్రమంలో ఓ పొలంలోని నీటి కుంటలో జారి పడ్డాయి. అందులో నుంచి బయట పడేందుకు అనేక రకాలుగా శ్రమించాయి. కుంటలో అటు ఇటు తిరుగుతూ.. తప్పించుకునే ప్రయత్నం చేశాయి. అయినా ఫలితం దక్కలేదు. దీంతో రాత్రంతా నీటిలోనే ఇబ్బంది పడ్డాయి. ఆ తర్వాతి రోజు పొలం యజమాని సనత్ రాయ్.. నీటిలో చిక్కుకున్న ఏనుగులను గమనించి అటివీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. కుంటను వెడల్పు చేసి.. గజరాజులను సురక్షితంగా బయటకు తీశారు.