Telangana Decade celebrations : రసాభాసగా తెలంగాణ 'విద్యుత్ విజయోత్సవ' కార్యక్రమం
Clash in Telangana Decade celebrations at LB Nagar : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఎల్బీనగర్లో విద్యుత్శాఖ నిర్వహించిన 'విద్యుత్ విజయోత్సవ' కార్యక్రమం రసాభాసగా సాగింది. వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో ఆ శాఖ అధికారులు విద్యుత్ విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు లింగోజిగూడ డివిజన్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ పాల్గొన్నారు. ఇరువురు ప్రసంగించే క్రమంలో విమర్శ, ప్రతి విమర్శలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే అనుచరుల మధ్య మాటమాట పెరగడంతో అదికాస్త తోపులాటకు దారి తీసింది. అనంతరం తమపై ఎమ్మెల్యే అనుచరులు దాడులు చేశారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు వనస్థలిపురం ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేను అరెస్టు చేసేంత వరకు స్టేషన్ ముందే బైఠాయిస్తామని భీష్మించుకుని కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్లో చేరిన సుధీర్ రెడ్డి తమపై దాడులు చేస్తే ఊరుకునేదే లేదని హస్తం నేతలు హెచ్చరించారు.