Earth Day Special Painting: 'నేను భూమిని'.. చిత్రం ఒక్కటే.. అర్థాలే ఎన్నో..!
Earth Day Special Painting: నిప్పు సెగలతో రగులుతున్న రవిని కాస్తూ, మూడొంతుల నీటితో సమస్త జీవరాశికి ఆనవాలమైన భూమాతను రక్షించుకుందామని పిలుపునిస్తున్నాడు ఓ చిత్రకారుడు. మానవుల వైఖరి వల్ల భూమాత ఎంత కలుషితమవుతుంది.. ఎన్ని ఇబ్బందులను మనం కోరి తెచ్చుకుంటున్నాం అని అందరికీ చూపించాలి అనుకున్నాడు. అందుకు తన వంతు సామాజిక బాధ్యతగా ధరిత్రీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా భూమి పెయింటింగ్ వేశాడు. ఆరడుగుల పొడవు, ఆరడగుల వెడల్పు క్యాన్వాస్పై అద్భుతమైన వర్ణ చిత్రాన్ని గీశాడు. అందులో దాదాపు 195 దేశాలను, 15 మతాలు, ముఖ్యమైన సంఘటనలు, ప్రదేశాలు, కట్టడాలు, విధ్వంసకరమైన దృశ్యాలను ఆవిష్కరిస్తూ పుడమి తల్లి గర్భశోకాన్ని చిత్రరూపంలో పొందుపర్చాడు. తనే మహబూబాబాద్ జిల్లా కొమ్ములవంచ గ్రామానికి చెందిన వెంకటేశ్ కందునూరి. వివిధ సామాజిక అంశాలపై ఇప్పటికే వెయ్యికిపైగా చిత్రాలను గీసిన వెంకటేశ్.. మనమంతా ఒకే తల్లి పిల్లలమన్న భావన కలిగేలా సుమారు 6 నెలలపాటు శ్రమించి 'నేను భూమిని' అనే చిత్రాన్ని గీశాడు. ఆ పెయింటింగ్ ప్రత్యేకతలు, విశేషాలను ఈటీవీ భారత్తో పంచుకున్నాడు.