Currency Ganesh In Bangalore : దేశంలోనే ఫస్ట్టైమ్.. రూ.2.5 కోట్లతో గణేశుడి ఆలయం ముస్తాబు! - నోట్ల కట్టలు నాణేలతో గణేశుడి గుడి అలంకరణ
Published : Sep 18, 2023, 4:20 PM IST
Currency Ganesh In Bangalore :దేశంలో గణేశ్ నవరాత్రుల సందడి మొదలైంది. ఈ నేపథ్యంలో ఎవరికి తోచినట్టు వారు ఆ లంబోదరుడిని కొలుచుకుంటున్నారు. కొందరు పూలు, పండ్లతో ప్రత్యేకంగా మండపాలను అలంకరిస్తుంటే.. మరికొందరు కూరగాయలతో గణపతి ఆలయాలను ముస్తాబు చేస్తున్నారు. ఇందులో భాగంగానే కర్ణాటక బెంగళూరులోని పుట్టెన్హళ్లిలో ఉన్న శ్రీ సత్య గణపతి ఆలయాన్ని భారతీయ కరెన్సీలతో ప్రత్యేకంగా అలంకరించారు. ఇందుకోసం రూ.2.06 లక్షల నోట్లు, రూ.52.50 లక్షల నాణేలను వినియోగించారు. ఇందులో రూ.500, రూ.200, రూ.100, రూ.50, రూ.20, రూ.10 నోట్లు సహా అన్ని రకాల నాణేలు ఉన్నాయి. వీటిని దండల రూపంలో అమర్చి ఆలయం లోపల అలంకరించారు.
మండపాన్ని ఇలా తీర్చిదిద్దేందుకు మొత్తం 150 మంది భక్తులు గతనెల రోజులుగా కష్టపడ్డారు. ఈ ప్రత్యేక అలంకరణ ఆలయానికి వచ్చే భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా, గత 11 ఏళ్లుగా ఆలయంలోని వినాయకుడిని పండగ వేళ వివిధ రూపాల్లో అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈసారి కాస్త వినూత్నంగా ఆలోచించి ఇలా కరెన్సీ డెకరేషన్ చేశామని వారంటున్నారు. పైగా ఇలా ఇంత పెద్ద మొత్తంతో ఓ దేవుడి గుడిని అలంకరించడం దేశంలోనే తొలిసారి అని ట్రస్టు సభ్యులు చెబుతున్నారు. మరోవైపు నాణేలతో ఆలయంలో ఏర్పాటు చేసిన చంద్రయాన్-3, విక్రమ్ ల్యాండర్ ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
TAGGED:
currecy ganesha in bengaluru