'నన్ను కాపాడండి యోగి బాబా- ఇకపై అలా చేయను' అంటూ పోలీసులకు లొంగిపోయిన గ్యాంగ్స్టర్ - Cow Slaughter Culprit Surrendered To Police In UP
Published : Dec 18, 2023, 5:46 PM IST
Cow Slaughter Culprit Surrendered To Police In UP : ఉత్తర్ప్రదేశ్ బదాయూ జిల్లాలోని సహస్వాన్ పోలీస్ స్టేషన్లో ఓ వింత సన్నివేశం కనిపించింది. గోవధ కేసులో నిందితుడిగా ఉన్న ఓ గ్యాంగ్స్టర్ వినూత్న రీతిలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మెడలో ప్లకార్డు ధరించి నేరుగా పోలీసు స్టేషన్కు చేరుకున్నాడు. ఆ ప్లకార్డుపై 'యోగి బాబా దయచేసి నన్ను రక్షించండి, ఇక నుంచి నేను గోహత్య చేయను' అంటూ రాసి ఉంది. దీనిని చూసిన పోలీసులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు.
ఇదీ సంగతి
ఖైర్పుర్ ఖైరతి గ్రామానికి చెందిన మహ్మద్ ఆలం గత కొంతకాలంగా గోహత్యకు పాల్పడుతున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతడిపై గోవధ చట్టం కింద కేసు నమోదైంది. ఈ విషయం తెలుసుకున్న గ్యాంగ్స్టర్ ఆలం పరారయ్యాడు. అతడి కోసం చాలాకాలంగా వెతుకుతున్నారు పోలీసులు. అయినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో సోమవారం ఉన్నట్టుండి మహ్మద్ ఆలం మెడలో ప్లకార్డును ధరించి పోలీస్ స్టేషన్ ముందు హాజరయ్యాడు. గోవులను చంపినందుకు తాను లొంగిపోతానని పోలీసులను కోరాడు. ఇక నుంచి గోవధ చేయనని రాసుకొచ్చిన ప్లకార్డును అక్కడే ఉన్న పోలీసులకు చూపించాడు. ఇది గమనించిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అనంతరం అతడిని అరెస్టు చేసి స్టేషన్ లోపలకు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఎస్ఎస్పీ ఓపీ సింగ్ ధ్రువీకరించారు. మహ్మద్ ఆలంను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన తెలిపారు.