Brahmanandam Invited CM KCR to his Son's Wedding : ప్రముఖ సినీనటుడు బ్రహ్మానందం ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. కుటుంబ సమేతంగా ప్రగతి భవన్కు వచ్చిన బ్రహ్మానందం.. హైదరాబాద్లో త్వరలో జరగనున్న తన రెండో కుమారుడు సిద్ధార్థ్ వివాహానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ మేరకు కేసీఆర్కు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం తన స్వహస్తాలతో వేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని కేసీఆర్కు అందజేశారు. ఈ సందర్భంగా కాసేపు బ్రహ్మానందంతో మాట్లాడిన కేసీఆర్.. కాబోయే వధూవరుల వివరాలతో పాటు సినిమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బ్రహ్మానందం దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చే నెలలో సిద్ధార్థ్ వివాహం ఐశ్వర్యతో జరగనుంది.
ఇక బ్రహ్మానందం వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు గౌతమ్ అందరికీ సుపరిచితుడు కాగా.. రెండో కుమారుడైన సిద్ధార్థ్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. వృత్తిరీత్యా డాక్టర్ అయిన సిద్ధార్థ్ నిశ్చితార్థం.. డాక్టర్ ఐశ్వర్యతో మే నెలలో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఎంతోమంది సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.