Published : Jan 5, 2024, 8:36 PM IST
కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణి అవలంభిస్తోంది : మురళీధర్రావు
BJP Leader Muralidhar Rao on Kaleshwaram Investigation : అదానీ దోపిడీకి, అవినీతికి ప్రతీక అయితే అటువంటి అదానీతో రాష్ట్రంలో వ్యాపారాలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగంగా కోరడాన్ని ఏమనాలని బీజేపీ మధ్యప్రదేశ్ ఇంఛార్జీ మురళీధర్రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ రెండు నాలుకల ధోరణి అవలంభిస్తోందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ రాష్ట్రపతిని కోరిందని గుర్తు చేశారు.
ప్రధాని మోదీ, అమిత్ షాను కలిసినప్పుడైన కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపించాలని కోరుతారని భావించినప్పటికీ రేవంత్ రెడ్డి సీబీఐ దర్యాప్తు కోరలేదని ఆయన మండిపడ్డారు. సీబీఐతో విచారణ జరిపించకపోతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేయడమేనన్నారు. ఫార్మా సిటీని రద్దు చేస్తామన్న ముఖ్యమంత్రి, మళ్లీ రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటించారన్నారు. ఫార్మా సిటీ రద్దు నిర్ణయం వెనకకు తీసుకోవడం వెనక ఉన్న రహస్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒప్పంద రాజకీయాలకు పునాదులు వేస్తున్నాయని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మోదీతో ఉన్నారని బహిర్గతమవుతుందన్నారు. నిజాం వారసత్వ రాజకీయాలను కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్నాయని దుయ్యబట్టారు.