తెలంగాణ

telangana

toll

By

Published : Jul 23, 2023, 11:51 AM IST

ETV Bharat / videos

Viral Video : రూ.90 కోసం టోల్‌ ప్లాజాపై దాడి.. కర్రలతో వీరంగం సృష్టించిన వ్యక్తి

Attack On Bhikkanur Toll Plaza : టోల్‌ ప్లాజా వద్ద టోల్‌ కట్‌ అయిందని ఓ వ్యక్తి.. ఏకంగా అక్కడి సిబ్బంది, మేనేజర్‌పైనే కర్రతో దాడి చేశాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌ టోల్‌ ప్లాజా వద్ద జరిగింది. ఈ దాడి మొత్తం ప్లాజా వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. అనంతరం టోల్‌ప్లాజా సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు, టోల్ ప్లాజా సిబ్బంది కథనం ప్రకారం.. 

వెంకటరెడ్డి అనే వ్యక్తి కామారెడ్డి నుంచి భిక్కనూర్ వైపు కారులో వెళ్తున్న సమయంలో టోల్ ప్లాజా వద్ద ఫాస్ట్ ట్యాగ్ ద్వారా ఆటోమేటిక్‌గా రూ.90లు కట్ అయింది. దీంతో వెంకటరెడ్డి కోపంతో డబ్బులు ఏ విధంగా కట్ చేస్తారంటూ టోల్ ప్లాజా సిబ్బందిని ప్రశ్నిస్తూ ఓ నాయకుడికి ఫోన్ చేశాడు. వెంటనే టోల్ ప్లాజా వద్దకు వచ్చిన ఆ వ్యక్తి.. మద్యం మత్తులో టోల్ ప్లాజా సిబ్బంది, టోల్ ప్లాజా బూత్​లు, మేనేజర్‌పై కర్రతో దాడి చేశారు. సుమారు అరగంట పాటు వెళ్లే వాహనాలకు అడ్డు తెలుపుతూ.. టోల్ చెల్లించకూడదని టోల్ ప్లాజా గేట్లను పైకి లేపుతూ గేట్ల వద్ద హంగామా సృష్టించాడు. 

దీంతో టోల్ ప్లాజా సిబ్బందికి ఆ వ్యక్తికి మధ్య వాగ్వాదం జరిగింది. వెంటనే టోల్ ప్లాజా సిబ్బంది స్థానిక భిక్కనూర్ పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకొని అతడిని సముదాయించారు. అయినా వినని అతడు.. పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగి.. నానా హంగామా సృష్టించాడు. దాడి చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఈ దాడికి పాల్పడింది మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు భీంరెడ్డిగా పోలీసులు గుర్తించారు. అనంతరం పోలీసులు భీంరెడ్డి, వెంకట్ రెడ్డిని స్థానిక భిక్కనూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. టోల్ ప్లాజా సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details