High Temperature in Adilabad : ఆకులే గొడుగులై.. కూలీలకు నీడనిచ్చాయి - telangana latest news
High Temperature in Adilabad : ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని భయపడి ఇంట్లో ఉంటే పూట గడవని బతుకులు. జీవనం కొనసాగించేందుకు భగభగలు కురిపిస్తున్న ఎండని సైతం లెక్కచేయకుండా తెగించి పని చేయాల్సిన పరిస్థితులు వాళ్లవి. సూరీడు నడినెత్తి మీద నాట్యం చేస్తున్నా.. తెగించి పనులు చేస్తే తప్ప ఆ పూట కడుపుకు తిండి దొరకని బతుకులు. అందుకే ఆదిలాబాద్ జిల్లాలోని వ్యవసాయ కూలీలు మండే ఎండలోనూ వ్యవసాయ పనులు చేస్తున్నారు. ఎండ ధాటికి తట్టుకునేందుకు ఆకులనే గొడుగులుగా ఉపయోగిస్తున్నారు.
వ్యవసాయమే ప్రధాన వృత్తిగా భావించి జీవిస్తున్న ఆదివాసీలు.. భగ భగ మండే ఎండలో కూలి పనికి వెళ్తున్నారు. వేరు శనగ పంటను తీసేందుకు వారు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ పని చేస్తున్నారు. ఎండ తీవ్రత నుంచి తప్పించుకోవడానికి వారికి అందుబాటులో ఉన్న వేరుశనగ ఆకులను తలపై గొడుగులా కప్పుకుంటున్నారు. ఇంత కష్టపడి పని చేస్తున్నా వారికి వచ్చే డబ్బులు నామ మాత్రమేనని వాపోతున్నారు.