తెలంగాణ

telangana

By

Published : May 17, 2021, 4:54 PM IST

ETV Bharat / sukhibhava

అధిక రక్తపోటు ఉందా? ఈ జాగ్రత్తలు తీసుకోండి!

అధిక రక్తపోటు లక్షణాలు ఆఖరి దశ వరకు అంతగా కనిపించని కారణంగా ఈ వ్యాధిని నిశ్శబ్దంగా ప్రాణాలు హరించే జబ్బుగా వైద్యలు గుర్తించారు. మెదడులో రక్తస్రావానికి, గుండెపోటుకు కూడా ఇది కారణమవుతుంది. కొవిడ్-19 విస్తరిస్తున్న ఈ కాలంలో అధిక రక్తపోటు ఉన్నవారు తీసుకోవలసిన జాగ్రత్తలు.. కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.

World Hypertension Day 2021
అధిక రక్తపోటు – నిశ్శబ్ద హంతకి..

వయసు పెరిగే కొద్దీ వెంటాడే సమస్య అధిక రక్తపోటు.మెదడు, గుండె, మూత్రపిండాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ.. మానవాళికి అధిక రక్తపోటు సవాలుగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మందికి అధిక రక్తపోటు అంటే ఏమిటో తెలిసినా.. ఇది కలుగజేసే ప్రమాదాలు తెలియక నిర్లక్ష్యం చేస్తున్నారు. అందువల్ల ప్రతి ఏటా మే 17వ తేదీన అధిక రక్తపోటుపై అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ సంవత్సరం “మీ రక్త పీడనం సరిగ్గా కొలుచుకోండి, నియంత్రించండి, దీర్ఘకాలం జీవించండి” అనే నినాదంతో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల (2019) ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 113 కోట్ల మంది అధిక రక్తపోటు సమస్యతో జీవిస్తున్నారు. వీరిలో 60శాతం మంది తక్కువ ఆదాయమున్న దేశాల్లోనే జీవిస్తున్నారు. 2015 లెక్కల ప్రకారం ప్రతి 4 మంది పురుషుల్లో ఒకరికి, ప్రతి 5 మంది స్త్రీలలో ఒకరికి అధిక రక్తపోటు ఉంటుంది. అధిక రక్తపోటులో లక్షణాలు ఏమీ కనిపించక పోవడంతో దీనిని నిశ్శబ్దంగా ప్రాణం తీసే మహమ్మారిగా వైద్యులు గుర్తించారు. తరచూ రక్తపోటును పరీక్షించుకుంటూ ఉంటేనే దీని నుంచి మనల్ని మనం కపాడుకోగలం.

ప్రధానంగా కరోనా వేళ.. అధిక రక్తపోటు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అధిక రక్తపోటు అంటే ఏమిటి?

రక్తం ప్రవహిస్తూ ధమనుల గోడలపై కలుగజేసే పీడనాన్ని రక్తచాపం లేదా రక్తపోటు అంటాం. ఈ పీడనం ఎక్కువగా ఉంటే వ్యాధిగా పరిగణించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది. రక్తపీడనాన్ని కొలవటానికి పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ధమనులపై రక్తం కలుగజేసే పీడనాన్ని సిస్టాలిక్ ప్రెజర్ అంటారు. ఇది 140 మి.మి. వరకు ఉండవచ్చు. ధమనుల గోడలు సంకోచించి రక్తంపై కలుగచేసే పీడనాన్ని డయాస్టోలిక్ ప్రజెర్ అంటారు. ఇది 90 మి.మి. వరకు ఉండవచ్చు. అంతకు మించితే వైద్యున్ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

హైదరాబాద్ వీఐఎన్ఎన్​ అసుపత్రిలో వైద్యులుగా పనిచేసే రాజేష్ వుక్కల ఎండీ అధిక రక్తపోటును ఎలా నియంత్రిచుకోవాలో వివరించారు.

  • దినచర్య:

నిద్ర లేవడం, ఆహారం తీసుకోవడం తరువాత నిద్రించటం అన్నీ ఒక సమయం ప్రకారం పాటించాలి. ఇతరత్రా కూడా ఆరోగ్యకరమైన శారీరక, మానసిక అలవాట్లు పాటించాలి.

  • కాఫీవద్దు:

కాఫీ తాగటం బాగా తగ్గించండి. కాఫీలో ఉన్న కెఫిన్ రక్తపోటును పెంచుతుంది. కాఫీ కొందరిలో వేరువేరు లక్షణాలను చూపించినా కాఫీ ఎంత మేర తీసుకోవాలనేది మనమే నిర్ణయించుకోవాలి.

  • జంక్ ఫుడ్ కు దూరం:

ఇటువంటి ఆహారంలో చెక్కెర, క్యాలరీలు, అధిక మోతాదులో పిండి పదార్ధాలు ఉండటం వల్ల రక్తపీడనం పెరుగుతుంది. ఇంట్లోనే తయారుచేసుకున్న ఆహారం తీసుకోవటం ఉత్తమం.

  • వ్యాయామం:

ధ్యానం, యోగా, నడక చాలా గొప్పగా మన ఆరోగ్యానికి సహాయం చేస్తాయి. శారీరక వ్యాయామం అధిక రక్తపోటు సమస్యను సులభంగా పరిష్కరించగలదు. దీనివల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

  • బరువు:

శారీరక బరువు ఆరోగ్యకరంగా అనగా.. 22-24 బీఎంఐ వరకు ఉండవచ్చు. దీనివల్ల రక్తపోటు పెరగదు.

  • సోడియం తగ్గించండి:

ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకుంటే రక్తపోటు స్థాయిని పెంచుతుంది. అందువల్ల సలాడ్లు, పండ్లు ఎక్కువగా తీసుకుంటూ ఆహారంలో ఉప్పు తగ్గించవచ్చు.

  • ధూమపానం, మద్యపానం:

పొగ తాగటం, మద్యపానం మానివేయాలి.

గతంలో సాధారణంగా 50 సంవత్సరాల వయసు దాటిన తరువాత రక్తపోటు సమస్య కలిగేది. అయితే నేడు యువతలోనూ ఈ సమస్య కనిపిస్తోంది. మానసిక ఒత్తిడిని, ఆందోళనను నియంత్రించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.

రక్తపోటు కొలిచేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు:

  • రక్తపీడనం కొలిచే సమయంలో మాట్లాడరాదు.
  • చేతిని రక్తపీడన మానినికి సమానమైన ఎత్తులో దిండుపై ఆనించాలి.
  • రక్తపీడన మానిని బట్టల్లేని చేతిపై కట్టాలి.
  • కుర్చిలో కూర్చుని వీపుపై పెట్టి పాదాలను నేలపై అనించాలి.
  • కాలు మీద కాలు వేసుకుని కూర్చొరాదు.
  • ముందే మూత్రవిసర్జన చేసి ఉండాలి.
  • శారీరక శ్రమ చేసిన వెంటనే రక్తపోటు చూడరాదు. 10 నిమిషాల విశ్రాంతి తర్వాతే చూడాలి.

కొవిడ్-19 వస్తే..

మీ రక్తపీడనం అసాధారణంగా ఉన్నా, మీకు ఇబ్బందికరంగా అనిపించినా వైద్యున్ని సంప్రదించండి. అధిక రక్తపోటు ఉన్న వారు కోొవిడ్ మహమ్మరి కాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి కొవిడ్ లక్షణాలు తీవ్రంగా కలుగవచ్చు. అందువల్ల కింద సూచించిన జాగ్రత్తలను తీసుకోవాలి.

  • వైద్యులు సూచించిన విధంగా అధిక రక్తపోటు మాత్రలను వాడాలి.
  • సాధ్యమైతే ఇంటి దగ్గరే రక్తపీడనాన్ని సరి చూసుకోండి. శరీరంలో నీరు తగ్గితే రక్తపోటు తగ్గవచ్చు. హెచ్చుతగ్గులను గమనించి వైద్యున్ని సంప్రదించకుండా ఔషధాల మోతాదును మార్చకండి.
  • సరైన మోతాదులో నీరు తాగుతూ ఉండాలి. ముఖ్యంగా పెద్దలు నీరు త్రాగకపోతే సమస్య మొదలవుతుంది.
  • శారీరకంగా చురుగ్గా ఉండాలి. ఎక్కువ కాలం ఇంట్లోనే ఉండటం వల్ల శరీరానికి కావలసినంత వ్యాయామం లభించటం లేదు. సామాజిక దూరం పాటిస్తూ బయట నడక సాగించటం రక్తపోటు నియంత్రణకు చాలా అవసరం.

ABOUT THE AUTHOR

...view details