తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

కరోనా ఆందోళనకు 45నిమిషాల సూత్రం!

కొద్ది రోజులుగా ప్రపంచ మానవాళిని కుదిపేస్తోంది కరోనా మహమ్మారి. వైరస్​ విజృంభణతో కొందరిలో లేనిపోని దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయి. ఫలితంగా అనవసర ఆందోళనకు గురవడం సహా.. అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు అధ్యయనాల్లో తేలింది. మరి అలాంటప్పుడు ఈ ఒత్తిడి నుంచి బయటపడేదెలా? అని ఆలోచిస్తున్నారా? అయితే.. ఈ 45నిమిషాల సూత్రం పాటిస్తే సరి.

By

Published : Dec 9, 2020, 10:31 AM IST

TO OVER COME THE COVID-19 FEAR AND FOLLOW THESE 45MINUT ES RULE
కరోనా ఆందోళనకు.. 45నిమిషాల సూత్రం!

కరోనా భయం వెంటాడుతోందా? మిత్రులను, బంధువులను కలవలేకపోతున్నామని.. మనసు విప్పి మాట్లాడుకోలేకపోతున్నామని బెంగ పడుతున్నారా? ఇవన్నీ ఆందోళన, కుంగుబాటు లక్షణాలకు దారితీస్తున్నాయా? అయితే '45 నిమిషాల సూత్రం' పాటించండి. ఇది చాలా తేలికైనది. చాలామంది ఆచరించదగినది కూడా. దీన్ని అనుసరిస్తే ఆందోళన, కుంగుబాటు మూలంగా తలెత్తే ప్రతికూల భావనల నుంచి బయటపడటం తథ్యమన్నది చైనా పరిశోధకుల సూచన. కొవిడ్‌-19 పతాక స్థాయికి చేరుకున్న సమయంలో కలాశాల విద్యార్థులపై తాము నిర్వహించిన అధ్యయనం ఇదే విషయాన్ని నిరూపించిందని చెబుతున్నారు. ఇంతకీ ఆ అద్భుత సూత్రం ఏంటో తెలుసా?

  • ప్రతి రోజూ 45 నిమిషాల సేపు కఠినమైన వ్యాయామం, శారీరక శ్రమ చేయటం.
  • మరీ ముప్పావు గంట సేపు, అదీ కఠినమైన వ్యాయామాలేం చేస్తామని పెదవి విరవకండి. తక్కువ కఠినమైన వ్యాయామాలైతే 80 నిమిషాల సేపు చేసినా సరే. పోనీ తేలికైన వ్యాయామాలే కావాలనుకుంటే.. 108 నిమిషాల సేపు చేసినా చాలు.
    కరోనా ఆందోళనకు.. 45నిమిషాల సూత్రం!

దీన్ని పాటించినవారిలో నిరాశ, నిస్పృహ వంటి ప్రతికూల భావనలు చాలావరకు తగ్గిపోవటం విశేషం. ఈ కాలేజీ విద్యార్థుల్లో ఎవరూ కొవిడ్‌-19 బారినపడకపోవటం విశేషం. ఇతరులకు దూరంగా ఉండటం, కరోనా మీద నెలకొన్న భయం వంటివే వీరిలో ఆందోళన, కుంగుబాటు లక్షణాలకు బీజం వేయటం. అందువల్ల కరోనా భయం, ఇతరులను కలవలేకపోవటం వల్ల తలెత్తే ప్రతికూల భావనల నుంచి, మానసిక ఒత్తిడి నుంచి బయట పడటానికి మరింత ఎక్కువ వ్యాయామం, శ్రమ చేయటం అవసరమని అధ్యయన ఫలితాలు సూచిస్తున్నాయని పరిశోధకులు గుర్తుచేస్తున్నారు. వ్యాయామం, శారీరక శ్రమతో మెదడులో డొపమైన్‌ వంటి మానసిక ఉల్లాసాన్ని కలిగించే రసాయనాలు ఎక్కువగా విడుదలవుతాయి. ఇవి ఉత్సాహాన్ని, హుషారును కలగిస్తాయి. ఏకాగ్రత పెరగటం వల్ల లేనిపోని ఆలోచనలు, భయాలు మనసును వేధించవు. మరింకేం.. వెంటనే 45 నిమిషాల సూత్రాన్ని పాటించటం ఆరంభించండి.

కరోనా ఆందోళనకు.. 45నిమిషాల సూత్రం!

ప్రపంచ ఆరోగ్య సంస్థ..

వ్యాయామ ప్రాధాన్యాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం గట్టిగా నొక్కి చెబుతోంది. దీని విషయంలో కొత్త మార్గదర్శకాలనూ రూపొందించింది. వీటిని త్వరలోనే అన్ని దేశాలు ఆమోదించనున్నాయి. కరోనా మూలంగా చాలామంది ఇంటికే పరిమితమవుతుండటం, ఇది మధుమేహం వంటి సాంక్రమికేతర జబ్బులు పెరగటానికి దారితీసే ప్రమాదమున్న నేపథ్యంలో ఈ మార్గదర్శకాలను రూపొందించటం గమనార్హం. ఇందులో ప్రధానాంశం పెద్దవాళ్లంతా వారానికి కనీసం 150-300 నిమిషాల సేపు ఒక మాదిరి నుంచి కఠినమైన ఏరోబిక్‌(గుండె వేగంగా కొట్టుకునేలా, ఆక్సిజన్‌ను మరింత ఎక్కువగా గ్రహించేలా చేసేవి) వ్యాయామాలు చేయాలని సూచించటం. దీర్ఘకాల జబ్బులు లేదా వైకల్యంతో బాధపడుతున్నవారికీ ఇదే నియమం వర్తిస్తుంది. పిల్లలు, యుక్తవయసు వారైతే రోజుకు సగటున 60 నిమిషాల సేపు వ్యాయామం అవసరం. వృద్ధులైతే కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలతో పాటు శరీర నియంత్రణ, సమన్వయానికి తోడ్పడే వాటి మీదా దృష్టి పెట్టాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ సూచిస్తోంది. ఇవి తూలి కింద పడిపోవటాన్ని నివారిస్తాయి. మొత్తంగా ఆరోగ్యమూ ఇనుమడిస్తుంది.

ప్రజలంతా చురుకుగా ఉంటే ప్రపంచ వ్యాప్తంగా ఏటా 50 లక్షల మరణాలను తగ్గించుకోవచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రత్యేకంగా గుర్తుచేస్తోంది. మధుమేహం, గుండెజబ్బులు వంటివి కొవిడ్‌-19 ముప్పు పెరిగేలా చేయటమే కాదు, వీటితో జబ్బు తీవ్రమవుతుండటం తెలిసిందే. కరోనా మహమ్మారి కాలంలో ఏమాత్రం కదలని జీవనశైలితో ఇలాంటి జబ్బులు పెరిగే ప్రమాదముంది.

వైద్య ఖర్చుల పరంగానూ..

ప్రపంచ ఆరోగ్యసంస్థ గణాంకాల ప్రకారం- పెద్దవాళ్లలో ప్రతి నలుగురిలో ఒకరు, యుక్తవయసువారిలో ప్రతి ఐదుగురిలో నలుగురు తగినంత శారీరక శ్రమ చేయటం లేదు. దీంతో ప్రత్యక్షంగా.. అంటే వైద్యఖర్చుల పరంగా సుమారు రూ.4లక్షల కోట్లు, పరోక్షంగా(ఉత్పాదకత తగ్గటం వంటివి) మరో రూ.లక్ష కోట్ల భారం పడుతుందని అంచనా. గుండెజబ్బులు, మధుమేహం, క్యాన్సర్‌ వంటి జబ్బులతో పాటు ఆందోళన, కుంగుబాటు లక్షణాలు తగ్గటానికి శారీరక శ్రమ చాలా కీలకం. జ్ఞాపకశక్తి ఇనుమడించటానికి, మెదడు ఆరోగ్యంగా పనిచేయటానికీ ఇది తోడ్పడుతుంది. 'ప్రతి కదలికా ముఖ్యమే. కరోనా మహమ్మారి ఆంక్షల నేపథ్యంలో ఇవి మరింత ప్రధానం' అని ప్రపంచ ఆరోగ్యసంస్థ డైరెక్టర్‌ జనరల్‌ పేర్కొంటున్నారు. వ్యాయామం ఎలాంటిదైనా, ఎంతసేపు చేసినా ఆరోగ్యం పుంజుకుంటుంది. కాకపోతే ఎక్కువసేపు చేస్తే మంచిది. మధ్యలో ఆపకుండా కొనసాగిస్తే ఇంకా మంచిది.

ఇదీ చదవండి:అటవీ సంరక్షణలో 'అతడే ఒక సైన్యం'

ABOUT THE AUTHOR

...view details