మన శరీరంలో అవసరమైన పనులు అవసరమైన సమయంలోనే జరగాలి. అవసరం తీరాక ఆగిపోవాలి. లేకపోతే తీవ్ర అనర్థాలకు దారితీస్తుంది. రక్తం గడ్డ కట్టే ప్రక్రియే దీనికి మంచి ఉదాహరణ. మనకు ఏదైనా గాయమైతే రక్తంలోని ప్లేట్లెట్లు, ఎర్ర రక్తకణాలు జట్టుకట్టి ఫిబ్రిన్ సాయంతో రక్తాన్ని గడ్డ కట్టించేస్తాయి. వెంటనే రక్తస్రావం ఆగిపోతుంది. మరి అనవసరంగా.. అదీ రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టటం మొదలైతే? తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ప్రాణాపాయాన్నీ తెచ్చిపెడుతుంది. థ్రాంబోసిస్ ఇలాంటి విపత్కర పరిస్థితినే తెచ్చిపెడుతుంది. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ప్రతి నాలుగు మరణాల్లో ఒకటి దీని మూలంగా తలెత్తే సమస్యలతోనే మరణిస్తున్నారు! థ్రాంబోసిస్పై అవగాహన లేకపోటమే దీనికి ప్రధాన కారణం.
రక్తం గడ్డలు సిరల్లో, ధమనుల్లో ఎక్కడైనా ఏర్పడొచ్చు గానీ ఎక్కువగా సిరల్లోనే పుట్టుకొస్తుంటాయి. ప్రధానంగా కాలి సిరల్లో ఏర్పడుతుంటాయి. ఇవి రక్త ప్రవాహానికి అడుగడుగునా అడ్డుపడుతుంటాయి. అంతేకాదు, రక్తనాళాల గోడల నుంచి విడిపోయి, రక్తంలో కలిసి ఇతర భాగాలకూ చేరుకోవచ్చు (వీనస్థ్రాంబోఎంబాలిజమ్- వీటీఈ). ఇలా ఊపిరితిత్తులకు చేరుకొని (పల్మనరీ ఎంబాలిజమ్) ప్రాణాంతకంగా పరిణమించొచ్చు. కొవిడ్-19లోనూ దీన్ని చూస్తూనే ఉన్నాం.
ఏంటీ కారణాలు?
నాళాల లోపలి పైపొర (ఎపిథిలియం) దెబ్బతినటం: గాయాలు, శస్త్రచికిత్సలు, ఇన్ఫెక్షన్లు.. ఇలా వాపు ప్రక్రియ (ఇన్ఫ్లమేషన్) ప్రేరేపితం కావటానికి దోహదం చేసేవేవైనా రక్తనాళాల లోపలి పైపొరను దెబ్బతీయొచ్చు. ఈ పొర మైనంలా మృదువుగా ఉంటుంది. ఏ కారణంతో దెబ్బతిన్నా రక్తం గడ్డకట్టే ప్రక్రియ అస్తవ్యస్తమైపోతుంది.
రక్త ప్రసరణ నిలిచిపోవటం (స్టేసిస్): రక్తం నిరంతరం ప్రవహిస్తూ ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా నిల్వ ఉండిపోతుంటే గడ్డల ముప్పు పెరిగినట్టే. గుండె వైఫల్యం, శారీరక శ్రమ లేని జీవనశైలి, సుదూర ప్రయాణాల వంటివన్నీ ఇందుకు దోహదం చేసేవే.
రక్తం ఎక్కువగా గడ్డకట్టే తత్వం (హైపర్ కొయాగ్యుబిలిటీ): కొందరికి జన్యులోపాల మూలంగా రక్తం గడ్డకట్టే ప్రక్రియ గుణం ఎక్కువగా ఉంటుంది. ల్యూపస్ వంటి స్వీయరోగనిరోధక జబ్బులూ ఇందుకు దోహదం చేయొచ్చు.
డీవీటీ ప్రధానం
సిరల్లో ఏర్పడే రక్తం గడ్డల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది డీప్ వీన్ థ్రాంబోసిస్ (డీవీటీ) గురించే. ఎక్కువగా కనిపించేవి ఇవే. కాళ్లలో, గజ్జల్లో, చేతుల్లో ఎక్కడైనా ఏర్పడొచ్చు. ఇవి కొందరిలో ఉన్నట్టుండి తలెత్తొచ్చు. పైకేమీ తెలియకుండా దీర్ఘకాలంగా కొనసాగుతూ వస్తుండొచ్చు. చిన్న గడ్డలైతే లక్షణాలేవీ ఉండవు. ఒక మాదిరి గడ్డలు గలవారికి పాదాలు, మడమలతో పాటు కాళ్లు వాచిపోవచ్చు. నొప్పి పుట్టొచ్చు. సాధారణంగా నొప్పి పిక్కల్లో మొదలవుతుంటుంది. చర్మం ఎరుపెక్కొచ్చు. నల్లగానూ అవ్వచ్చు. కాళ్లు టైర్ల మాదిరిగా గట్టిగానూ అవ్వచ్చు. కొన్నిసార్లు ఉన్నట్టుండి కాలు ఎరుపెక్కి, వాచిపోయి నడవటమే కష్టం కావొచ్చు. వెంటనే చికిత్స చేయకపోతే ప్రాణాల మీదికీ రావొచ్చు.
ఊపిరితిత్తుల్లోకి చేరుకోవటం
కొందరిలో గడ్డలు రక్తనాళం నుంచి విడిపోయి, రక్తంలో కలిసి పైకి ప్రయాణించొచ్చు. ఇలా ఊపిరితిత్తులకూ చేరుకోవచ్చు (పల్మనరీ ఎంబాలిజమ్). పెద్ద పెద్ద గడ్డలైతే క్షణాల్లోనే మరణం సంభవిస్తుంది. గడ్డలు మధ్యస్థంగా ఉన్నవారికి ఆయాసం, శ్వాస వేగంగా తీసుకోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఛాతీలో నొప్పి ఉండొచ్చు. గాఢంగా ఊపిరి తీసుకుంటే నొప్పి ఎక్కువవుతుంది. గుండె వేగమూ పెరుగుతుంది. తల తేలిపోతున్నట్టూ అనిపించొచ్చు. రక్తపోటు బాగా పడిపోతుంది. శ్వాస సరిగా ఆడకపోవటం వల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయులూ పడిపోతాయి. దీనికి సత్వరం చికిత్స అవసరం.
ముప్పు ఎవరికి?
కాళ్లకు తగినంత వ్యాయామం లేకపోవటం.. ప్రయాణాల్లో గానీ కంప్యూటర్ ముందు గానీ కదలకుండా గంటల తరబడి కూర్చోవటం.. ఏదైనా జబ్బుతో, ప్రమాదాలతో లేదూ ఆపరేషన్లతో కాళ్లు కదపలేని స్థితిలో రోజుల తరబడి మంచం మీదే ఉండటం.. హార్మోన్ మాత్రలు దీర్ఘకాలంగా వాడుకోవటం.. ఊపిరితిత్తులు లేదా క్లోమగ్రంథి క్యాన్సర్ల వంటివన్నీ వీటి ముప్పు పెరిగేలా చేసేవే. గర్భిణులకు, గుండె వైఫల్యం, గుండె జబ్బులు, న్యుమోనియా, హెచ్ఐవీ వంటి జబ్బులతో బాధపడేవారికీ ముప్పు ఎక్కువే.