నీరా నుండా.. ఆమె తల్లిదండ్రులు కెనడాలో స్థిరపడ్డ భారతీయ ఇంజినీర్లు. అక్కడే గ్రాడ్యుయేషన్ వరకూ చదువుకున్న నీరా... హార్వర్డ్లో ఎంబీఏ చేసి మోర్గాన్ స్టాన్లీలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా చేరారు. నీరా తల్లి ఆదివాసీల పిల్లల కోసం ఖరగ్పుర్ సమీపంలో ఒక గురుకులాన్ని నెలకొల్పారు. అక్కడ వందల మంది పిల్లలు చదువుకునేవారు. వారి జీవితాల్లో మార్పు తేవడానికి నీరా తల్లి ఎంతో కృషిచేసేవారు. కానీ వారికి నిధుల కొరత ఉండేది. ఎంబీఏలో భాగంగా భారత్లో మహిళాభివృద్ధికి కృషిచేస్తున్న ఓ స్వచ్ఛంద సంస్థలో ఇంటర్న్షిప్ చేశారు నీరా. మారుమూల పల్లెల్లోనూ సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నా విరాళాలు తెచ్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కోవడం చూశారామె. అప్పుడే తన బ్యాంకింగ్, మేనేజ్మెంట్ నైపుణ్యాలను ఉపయోగించి స్వచ్ఛంద సంస్థలకు నిధులు తేవాలనుకున్నారు.
'ఇంటర్న్షిప్ తర్వాత అమెరికా వెళ్లా. నా చదువు కోసం తీసుకున్న రుణం తీర్చడానికి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్గా పనిచేశా. రుణం చెల్లించడం పూర్తయ్యాక భారత్ తిరిగి రావాలనుకున్నా’ అని చెబుతారు నీరా. మోర్గాన్ స్టాన్లీలో పనిచేస్తున్నపుడు నీరాకు కాబోయే భర్త దేవల్ సంఘ్వీతో పరిచయమైంది. ప్రవాస భారతీయుడైన దేవల్ భారత్లో ఒక ఎన్జీఓలో ఇంటర్న్షిప్ చేశారు. ఇద్దరి ఆలోచనలూ కలిశాయి. భారత్లో ఎన్జీవో ప్రారంభించి దాని ద్వారా మహిళలూ, పిల్లలూ, నిరుపేదలకోసం పనిచేసే ఎన్జీఓలూ, లాభాపేక్షలేని సంస్థలకు నిధులు అందించాలనుకున్నారు. ఈ అంశంపైన ‘పవర్పాయింట్ ప్రెజెంటేషన్’ను సిద్ధం చేసి ఆఫీసులో మిత్రులకి చూపించారు. వారినుంచి కేవలం రూ.40వేలు విరాళాలుగా వచ్చాయి. అదే సమయంలో మోర్గాన్ స్టాన్లీ ఛైర్మన్గా ఉన్న రిచర్డ్ బి ఫిషర్ను కలిశారు. ‘దాతృత్వ కార్యక్రమాలకు విరాళాలు ఇవ్వాలనుకుంటున్నా. అది మీతోనే మొదలుపెడతా'... అని చెప్పి అప్పటికప్పుడే కోటి రూపాయల చెక్ ఇచ్చారు. తర్వాత అయిదేళ్లపాటు ఏటా రూ.35 లక్షలు చొప్పున ఇస్తామనీ మాటిచ్చారాయన. ఫిషర్ ఇచ్చిన భరోసాతో ఇండియా వచ్చి 1999లో ‘దసరా’ పేరుతో ఓ సంస్థను మొదలుపెట్టారు నీరా, దేవల్. ప్రారంభంలో విద్య, ఉపాధి కల్పనలో కృషిచేస్తున్న మ్యాజిక్బస్, విల్గ్రో సంస్థలకు నిధులు ఇచ్చారు.