టొమాటోతో ట్యాన్కి టాటా..!
అది ఎండా కాలమైనా.. చలి కాలమైనా.. సూర్యుని నుండి వెలువడే హానికారక అతినీలలోహిత కిరణాల వల్ల చర్మం నల్లబడడం, సహజ తేమను కోల్పోయి నిర్జీవంగా మారడం.. వంటివి మామూలే. మరి, ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఎంతో ఖరీదైన క్రీములు అసలు అవసరం లేదని, కేవలం టొమాటోలుంటే చాలంటున్నారు హంగరీ బ్యూటీస్. అందుకోసం టొమాటోను కట్ చేసి అందులోని గింజలుండే భాగాన్ని స్పూన్తో ఓ గిన్నెలోకి తీసుకోవాలి. దానికి కొద్ది మోతాదులో పంచదార, నిమ్మరసాన్ని కలిపి ముఖానికి అప్లై చేసి ఓ పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. టొమాటోలోని పోషకాలు మొటిమలు, జిడ్డును దూరం చేస్తాయి. ఇక అందులో కలిపిన పంచదార చర్మానికి స్క్రబ్లా పనిచేసి చర్మంపై పేరుకుపోయిన మృతకణాల్ని తొలగిస్తుంది. నిమ్మరసం సూర్యరశ్మి వల్ల చర్మం కోల్పోయిన కాంతిని తిరిగి ఇనుమడించేలా చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం! మీ ఇంట్లో టొమాటోలుంటే వెంటనే ఈ సులభమైన, సహజసిద్ధమైన చిట్కాతో సన్ట్యాన్కి చెక్ పెట్టేయండి మరి!
క్యారెట్ నూనెతో మచ్చలు మాయం!
ఎంత చక్కనైన ఆకృతి కలిగిన ముఖమైనా.. మచ్చలు ఏర్పడితే అందవిహీనంగా కనిపిస్తుంది. ఇక వాటిని కనిపించకుండా చేయడానికి మనం పడే తంటాలు అన్నీ ఇన్నీ కావు. మేకప్, ఫేషియల్స్ అంటూ.. ఎన్నెన్నో బ్యూటీ టెక్నిక్స్ పాటిస్తాం.. కానీ ఫలితం తాత్కాలికమే! మరి, అలాకాకుండా ఇలాంటి మొండి మచ్చల నుండి మీ ముఖానికి శాశ్వత విముక్తి కలిగించాలంటే.. క్యారట్ నూనెను వాడితే సరిపోతుందంటున్నారు హంగరీ మగువలు. ఈ క్యారెట్ నూనెను నేరుగా మచ్చలపై అప్లై చేసి రాత్రంతా ఉంచుకుని.. ఉదయాన్నే నీటిలో ముంచిన గుడ్డతో ముఖాన్ని శుభ్రంగా తుడుచుకోవాలి. ఒకవేళ మీకు రాత్రి పెట్టుకోవడం కుదరకపోతే.. మీరు రాసుకునే సీరమ్, మాయిశ్చరైజర్ వంటి వాటిలో ఈ నూనెను కొన్ని చుక్కలు కలిపి వాడినా చక్కటి ఫలితం ఉంటుంది. ఈ క్యారట్ నూనెలోని యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్, విటమిన్ ‘ఎ’.. వంటి పోషకాలు నల్ల మచ్చల్ని తొలగించడంలో చురుగ్గా పనిచేస్తాయి. హంగరీ భామలు గత కొన్ని శతాబ్దాలుగా ఈ చిట్కాను పాటిస్తూ మచ్చలేని చందమామలుగా మెరిసిపోతున్నారు.
‘థర్మల్ వాటర్ బాత్’తో నవయవ్వనంగా!
అందమంటే కేవలం ముఖారవిందం ఇనుమడిస్తే చాలనుకుంటారు చాలామంది. కానీ నఖశిఖపర్యంతం అందంగా మెరిసినప్పుడే సౌందర్యం సంపూర్ణమవుతుంది. మరి అటువంటి అందాన్ని ‘థర్మల్ వాటర్ బాత్’తో పొందుతున్నామంటున్నారీ హంగరీ సుందరీమణులు. ఇందుకోసం ఆ దేశంలోని చాలా చోట్ల సహజసిద్ధంగా ఏర్పడిన థర్మల్ పూల్స్ ఉంటాయి. వర్షం నీరు సహజసిద్ధంగా వేడెక్కి ఏర్పడిన ఈ థర్మల్ పూల్స్లోని నీరు వేడిగా, చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేసే ఎన్నో ఖనిజాలతో మిళితమై ఉంటుంది. ఈ నీటిలో స్నానం చేయడం వల్ల అందులోని ఖనిజాలు పలు చర్మ సమస్యల్ని తొలగించి నఖశిఖపర్యంతం మేనును మెరిపిస్తాయని వారు నమ్ముతారు. ఈ పద్ధతి ఇప్పటిది కాదు.. దాదాపు 2000 సంవత్సరాల నుండి వారు తమ సౌందర్య పోషణలో భాగంగా దీన్ని పాటిస్తూ అటు శరీరాన్ని ఉత్తేజితం చేసుకుంటూనే.. ఇటు అందానికీ మెరుగులు దిద్దుతున్నారు. అలాగే ఈ ప్రక్రియ ద్వారా చర్మంపై ఏర్పడే ముడతలు, గీతలు వంటివి తగ్గి నవయవ్వనంగా మెరిసిపోవచ్చనేది వారి నమ్మకం. చర్మంపై ఏర్పడే దద్దుర్లు తగ్గి చర్మంలో సహజ తేమను నిలిపి ఉంచే గుణాలు కూడా ఈ నీటిలో ఉన్నాయి. ఇలా హంగరీలో ప్రాచుర్యం పొందిన ఈ థర్మల్ బాత్ టెక్నిక్ కాలక్రమేణా ఇతర దేశాలకూ విస్తరించింది. ఈ క్రమంలో మన దేశంలోనూ ప్రవేశించిన ఈ ట్రెండ్ని ప్రస్తుతం ప్రముఖ పట్టణాల్లోని కొన్ని స్పాలు అందుబాటులోకి తీసుకొచ్చాయి.