తెలంగాణ

telangana

సడెన్​గా మైకం కమ్మినట్లు అనిపిస్తుందా..? దేనికి సంకేతమో తెలుసా?

By

Published : Mar 28, 2023, 8:22 PM IST

మనలో చాలామందికి ఉన్నట్టుండి కళ్లు తిరిగినట్లు, మైకం కమ్మినట్లు కొద్ది క్షణాలు అనిపిస్తుంటుంది. కాసేపటి తర్వాత తిరిగి మామూలైపోతుంటుంది. అయితే చాలామంది ఈ విషయాన్ని సీరియస్​గా తీసుకోరు. కానీ ఆరోగ్యం మీద జాగ్రత్త వహించే వాళ్లు మాత్రం అసలు ఇలా ఎందుకు జరుగుతోందని మదనపడుతుంటారు. ఇలా మైకం రావడానికి కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.చాలాసేపు ఒకే చోట కూర్చొని హఠాత్తుగా లేవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఉన్నట్టుండి కళ్లు తిరిగినట్లు అనిపిస్తుంటుంది. కొంతమందికి నడుస్తున్న సమయంలో లేదంటే వేరే ఏదైనా పని చేస్తున్నప్పుడు మైకం కమ్మిన భావన కలుగుతుంటుంది. అసలు మైకం కలిగిన భావన లేదంటే కళ్లు తిరిగినట్లు ఎందుకు అనిపిస్తుంది. దాని వెనక ఉన్న కారణాలు ఏంటో చూద్దాం.

dizziness-causes-and-dizziness-solutions
మైకం కమ్మడం పరిష్కారాలు

మన శరీరంలో ఏ చిన్న మార్పు జరిగినా దాని ప్రభావం మన ఆరోగ్యం మీద ఉంటుంది. మనలో చాలామందికి కొన్ని రకాల ఆహార పదార్థాలను తినడం వల్ల సమస్యలు తలెత్తుతుంటాయి. ఉదాహరణకు కొందరికి కూల్ డ్రింక్ తాగినా లేదంటే ఐస్ క్రీం తిన్నా తలనొప్పి మొదలవుతుంటుంది. నిజానికి అంతకుముందు వరకు వాళ్లకు తలనొప్పి లేకపోయినా తమ శరీరానికి తగని ఆహారాన్ని తీసుకోవడం వల్ల అది మొదలవుతుంది.

చాలామంది తమ పనులు చేసుకుంటున్న క్రమంలో మైకం కమ్మిన భావనను ఎదుర్కొంటూ ఉంటారు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. వర్కవుట్ చేయడం, తగిన పోషకాహారం తినకపోవడం, బ్లడ్ ప్రెషర్ తగ్గడం, తగినంత నీరు లేకపోవడం, శరీరం వేడెక్కడం లాంటి ఇతర కారణాల వల్ల మైకం కమ్మడం లేదంటే తల తిరగడం, కళ్లు తిరగడం జరుగుతుంటాయి. ఈ కారణాల గురించి మరింత తెలుసుకుందాం.

వర్కవుట్ కారణం కావచ్చు:
చాలామంది అథ్లెట్లు ఎక్కువగా వర్కవుట్ చేస్తుంటారు. వారి కెరీర్ కోసం వాళ్లు అలా చేస్తుండగా దీని వల్ల గుండె పనితీరులో మార్పు వస్తుంది. ఈ సమయంలో గుండె బలంగా మారి తక్కువ హృదయ స్పందనల్లో ఎక్కువ రక్తాన్ని పంప్ చేస్తోంది. గుండె బలపడటం వల్ల ఇలా జరగ్గా వర్కవుట్ తర్వాత విశ్రాంతి తీసుకునే సమయంలో గుండెకు ఒక్కసారిగా విశ్రాంతి లభించడం వల్ల మైకం కమ్మిన భావన కలుగుతుంటుంది.

తగినంత తినకపోవడం కారణం కావచ్చు:
కొంతమంది రకరకాల కారణాల వల్ల తగినంత ఆహారాన్ని తినకుండా.. జ్యూస్​లతో కాలం వెల్లదీస్తుంటారు. దీని వల్ల శరీరంలో చక్కెరల స్థాయి పడిపోయి మైకం కమ్మినట్లు అనిపిస్తుంటుంది. కాబట్టి భోజనాన్ని మిస్ కాకుండా చూసుకోవడమే కాకుండా స్నాక్స్ కూడా తీసుకోవడం ఉత్తమం.

బ్లడ్ ప్రెషర్ నెమ్మదించడం:
మన శరీరంలో క్షణాల వ్యవధిలో మెదడు నుంచి కాళ్ల వరకు రక్తం పారుతుంది. అయితే మన శరీరంలో నరాల వ్యవస్థ కొన్నిసార్లు నెమ్మదిగా స్పందిస్తే రక్త ప్రవాహంలో మార్పు కలుగుతుంది. అంటే బ్లడ్ ప్రెషర్​లో మార్పు రావడం వల్ల మైకం కమ్మినట్లు భావన కలుగుతుంది.

తగినంత నీటిని తీసుకోకపోవడం:
మనలో చాలామంది డీహైడ్రేట్ అయినా కూడా పట్టించుకోరు. తక్కువ నీటిని తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. అయితే శరీరానికి తగినంత నీరు అందకపోతే మైకం కమ్మిన భావన కలుగుతుంది. కాబట్టి శరీరానికి ఏదో ఒక రూపంలో తగినంత నీరు అందేలా చూసుకోవాలి.

శరీరం వేడెక్కడం:
వర్కవుట్ వల్ల లేదంటే వేడి పరిస్థితుల వల్ల కొన్నిసార్లు శరీరం వేడెక్కుతుంది. ఇది కూడా మైకం రావడానికి కారణం కావచ్చు. వర్కవుట్ చేసేటప్పుడు శరీరానికి తగినంత విశ్రాంతి దొరుకుతుందని చూసుకోండి. అలాగే వేడి వాతావరణంలో మీ శరీరం గురించి పట్టించుకోవడం మంచిది.

లోపలి చెవి సమస్య కారణం కావచ్చు:
కొన్నిసార్లు లోపలి చెవితో ఏదైనా సమస్య ఏర్పడినా కూడా మైకం వస్తుంది. నిజానికి మైకం రావడం వల్ల అనారోగ్య సమస్య ఉన్నట్లు కాదు. కానీ మైకంతో పాటు వేరే ఏదైనా అనుభూతి చెందితే మాత్రం అందుకోసం వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

సడెన్​గా మైకం కమ్మినట్లు అనిపిస్తుందా..? దేనికి సంకేతమో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details