హైదరాబాద్కు చెందిన డాక్టర్ నారాయణ, లోరా దంపతుల రెండో కుమార్తె శశాంక అల. తల్లిదండ్రులు కేంద్ర ప్రభుత్వోద్యోగులు. ఐఐటీ-మద్రాసులో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన శశాంక సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించారు. దిల్లీలో సబ్కలెక్టరుగా విధుల్లో చేరారు. రెండేళ్ల కిందట మిజోరంలోని లాంగ్ట్లై జిల్లాకు కలెక్టరుగా వెళ్లారు. అప్పటికి శశాంకకు తన బ్యాచ్మేట్ భూపేష్తో వివాహమై, ఏడాది బాబు ప్రబీర్ ఉన్నాడు. ఆ బాబుని స్థానిక అంగన్వాడీ కేంద్రంలో చేర్పించారు. ఆ చిన్నారి కోసం ఏర్పాటుచేసిన ఆయా... బియ్యం, పప్పు ప్యాకెట్లను ఇంటికి తీసుకొచ్చేది. ఇలా ముడి సరకులు ఇవ్వడానికి గల కారణాన్ని అడిగితే... ఆ ప్రాంతంలో కాయగూరలు పండవని అందుకే అలా అందిస్తారని తెలుసుకున్నారు శశాంక. అవి కూడా పూర్తిగా పిల్లలకు చేరకపోవడంతో 36 శాతం మంది చిన్నారుల్లో తీవ్రమైన పౌష్టికాహార లోపం ఉన్నట్లు గుర్తించారామె. లాంగ్ట్లై జిల్లాలో అధిక ప్రాంతం కొండకోనల్లో ఉండటంవల్ల వ్యవసాయానికి అనువుగా ఉండదు. పొరుగునున్న అసోం నుంచి కూరగాయలు దిగుమతి చేసుకోవాల్సిందే. వర్షం పడితే రవాణా నిలిచిపోయి అవీ అందవు. ఇవన్నీ తెలిశాక పరిస్థితిని మార్చాలకున్నారు శశాంక.
అందరూ భాగస్వాములే...
ముందు స్వయంగా తన పెరట్లో కూరగాయలు, ఆకుకూరల విత్తనాలు వేయించారు. అవి చేతికి రావడానికి కొన్ని నెలలు పట్టింది. ‘మొదట మా బాబు చదివే అంగన్వాడీ కేంద్రం వద్దే నేలను చదును చేయించి ఆకుకూరలు, కూరగాయల విత్తనాలు వేయించా. అవి చేతికొచ్చేలోపు అన్నం, పప్పు వండి పిల్లలకు వడ్డించే ఏర్పాట్లు చేశా. సమీపంలోని నాలుగైదు అంగన్వాడీలూ ప్రాథమిక పాఠశాలల్లో ‘నా పాఠశాల- నా తోట’ పేరుతో ఓ ప్రాజెక్టును ప్రారంభించా. దీన్లో అంగన్వాడీ కార్యకర్తలూ, ఉపాధ్యాయులూ, పాఠశాలల విద్యార్థుల్ని భాగస్వాముల్ని చేశా. వీరికి శిక్షణ ఇప్పించి... మొక్కల పెంపకం, సంరక్షణ బాధ్యతలను వారికే అప్పజెప్ఫా ప్రతిరోజూ వాటిని పర్యవేక్షించేదాన్ని. కొద్దిరోజుల్లోనే ఆకుకూరలు చేతికొచ్చాయి. తర్వాత కాయగూరలు కూడా. అప్పట్నుంచీ అన్నం, పప్పుతోపాటు కూరలూ పెట్టేవారు. ఆరు నెలల్లోపు ఈ పద్ధతిని జిల్లా వ్యాప్తంగా అమలుచేశాను. క్రమంగా చిన్నారులకు పౌష్టికాహారం అందడం మొదలైంది. ఇక్కడ వారికి వ్యవసాయం అలవాటు లేదు. దాదాపుగా అందరూ ప్రభుత్వోద్యోగులే. కూరగాయల పెంపకానికి వాతావరణం అనువుగా ఉన్నా నేల చదునుగా ఉండదు. వీళ్లను సాగుకి ఒప్పించడం కష్టమైంది. వ్యవసాయ అధికారుల సాయం తీసుకోవడంతో పని కాస్త తేలికయింది. ఇప్పుడీ సాగు సేంద్రియ విధానంలోకి మళ్లింది.