పూర్తిగా కృష్ణశిలలతో నిర్మితమవుతున్న యాదాద్రి పుణ్యక్షేత్రం అద్భుత రూపంతో ప్రపంచ దేవాలయాల్లోనే ప్రత్యేకతను చాటుకోబోతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఉన్నతాధికారులు, ఆర్కిటెక్ట్లతో ప్రగతిభవన్లో సమావేశమయ్యారు. యాదాద్రి పనులు తుది రూపుదాలుస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దివ్యమైన అలంకృత రూపం ఉండేలా అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించారు.
పనుల పురోగతిపై ఆరా
స్వామి వారి ఆలయాన్ని త్వరలోనే పున: ప్రారంభించాలని నిర్ణయించి నేపథ్యంలో గడువులోగా తుది మెరుగులు దిద్దే పనులు పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. పనుల పురోగతిని ఆరా తీశారు. క్యూలైన్ నిర్మాణంలో చేపట్టాల్సిన అలంకరణ విషయమై సూచనలు చేశారు. 350 ఫీట్ల పొడవైన క్యూలైన్ నిర్మాణాన్ని ఇత్తడి డిజైన్లతో తీర్చిదిద్దాలని కేసీఆర్ తెలిపారు. క్యూలైను పొడవునా ప్రాకారం మీద బిగించే కలశపు నమూనాలను పరిశీలించిన ఆయన... నాలుగింటిలో ఒకదాన్ని ఖరారు చేశారు. ఉత్తర దిక్కున ప్రహరీ గోడను తొలగించి అక్కడ క్యూలైన్ నిర్మాణం చేపట్టాలని... ఏప్రిల్ 15 వరకు క్యూలైను నిర్మాణం పూర్తికావాలని గడువు విధించారు.
టెంపుల్ ఎలివేషన్తో..
'దీప స్తంభాన్ని, ప్రహరీని ఇత్తడితో సృజనాత్మకంగా తీర్చిదిద్దడంతో పాటు పెడస్టల్కు కూడా ఇత్తడితో ఆకృతులను బిగించాలి. శివాలయ ప్రహరీ గోడలకు ఇత్తడితో తీర్చిదిద్దిన త్రిశూలం ఆకారాలను బిగించాలి. ఉత్తర దిక్కు ప్రాకారాన్ని తొలగించి గుడి కనిపించేలా గ్రిల్స్, రెయిలింగ్లను ఏర్పాటు చేయాలి. ఇతర కట్టడాలు అడ్డులేకుండా, దేవాలయం చుట్టూ 360 డిగ్రీలు తిరిగి చూసినా సుందరంగా కనిపించేలా తుదిమెరుగులు దిద్దాలి. బ్రహ్మోత్సవాల్లో సుదర్శనం చక్రం ఏర్పాటు చేసిన తరహాలోనే శివాలయం చుట్టూ త్రిశూలం కనిపించేలా ఏర్పాట్లు చేయాలి. రథశాలను టెంపుల్ ఎలివేషన్తో తీర్చిదిద్దాలి.'
- కేసీఆర్, ముఖ్యమంత్రి