తెలంగాణ

telangana

తుది అంకానికి యాదాద్రి పనులు.. త్వరలోనే పునః ప్రారంభం!

యాదగిరిగుట్ట ప్రధానాలయంలో భక్తుల దర్శనానికి అనుమతించేందుకు రంగం సిద్ధమవుతోంది. ఆలయ పనులన్నీ ఇప్పటికే పూర్తి కాగా... మిగిలిన పనులు త్వరితగతిన కొనసాగుతున్నాయి. స్వామి వారి కైంకర్యాలకు ఉద్దేశించిన పుష్కరిణి సిద్ధం కాగా... భక్తుల కోసం దిగువన మరో పుష్కరిణి పనులు జరుగుతున్నాయి.

By

Published : Jan 22, 2021, 3:39 PM IST

Published : Jan 22, 2021, 3:39 PM IST

yadadri-temple-reopen-on-soon
దాదాపు అన్ని పనులు పూర్తి... త్వరలోనే యాదాద్రి ఆలయ పునఃప్రారంభం

దివ్యక్షేత్రంగా యాదాద్రిని తీర్చిదిద్దే పనులు చివరి దశకు చేరుకున్నాయి. అద్భుత శిల్పసౌందర్యంతో చారిత్రాత్మకత ఉట్టిపడేలా... ఆధ్యాత్మిక వాతావారణం వెల్లివిరిసేలా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఐదేళ్ల కిందట ప్రారంభమైన అభివృద్ధి పనులు తుదిదశకు చేరుకున్నాయి. విశాలంగా, నలుదిక్కులా మాఢవీధులు, సప్తగోపురాలు, అంతర్ బాహ్య ప్రకారాలు, ఆల్వార్ల విగ్రహాలతో కాకతీయ సంప్రదాయ కృష్ణశిలా శిల్పసౌరభం ఉట్టిపడేలా పనులు జరిగాయి. కొండపై ప్రధాన ఆలయ నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయి. శివాలయం కూడా సిద్ధమైంది.

దాదాపు అన్ని పూర్తి..

స్వామి వారి కైంకర్యాల కోసం కొండపైన పుష్కరిణి కూడా పూర్తి స్థాయిలో తయారైంది. కొండ కింద భక్తుల సౌకర్యార్థం మరో పుష్కరిణి పనులు జరుగుతున్నాయి. మెట్లు, ఇతర నిర్మాణల పనులు కొనసాగుతున్నాయి. ప్రెసిడెన్షియల్ కాటేజీ సహా... వీఐపీ కాటేజీల నిర్మాణం కూడా పూర్తైంది. మొత్తం 15 కాటేజీల్లో ఒకటి మినహా అన్ని పనులు పూర్తయ్యాయి. కళ్యాణకట్ట ఇంకా సిద్ధం కాలేదని అధికారులు వెల్లడించారు. పక్కనే ఉన్న దీక్షాపరుల మండపాన్ని ప్రస్తుతానికి కళ్యాణకట్టగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు.

బ్రహ్మోత్సవాలకు ముందే..

ప్రధాన ఆలయ పనులు పూర్తి కావడంతో పాటు కళ్యాణకట్ట, పుష్కరిణి సౌకర్యం ఉంటే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం బాలాలయంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. గర్భగుడిలో స్వామి వారికి నిరంతరం పూజాధికాలు, నైవేధ్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రధానాలయ పనులన్నీ పూర్తైన నేపథ్యంలో భక్తుల సందర్శనార్థం అనుమతించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరి నెలాఖరు, మార్చి మొదటి వారంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

చినజీయర్​ను సంప్రదించి..

అప్పటికే భక్తుల సందర్శనాలు కొనసాగుతుండాలన్న ఆలోచనతో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 16వ తేదీ వసంతపంచమి, 18న రథసప్తమి ఉన్న నేపథ్యంలో ఆ మహూర్తాల్లో పున:ప్రారంభం ఉండవచ్చని భావిస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారం వరకు ముఖ్యమంత్రి నిర్దేశించిన పనులన్నీ పూర్తవుతాయని అధికారులు చెప్తున్నారు. ఇక ముహూర్తానికి సంబంధించి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. చినజీయర్ స్వామిని సంప్రదించి ఆలయ పునఃప్రారంభం విషయమై ముఖ్యమంత్రి తుదినిర్ణయం తీసుకోనున్నారు. పనులు, ఏర్పాట్ల పరంగా పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంటామని... సీఎం నిర్ణయానికి అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్తున్నారు.

ఇదీ చూడండి:యాదాద్రి సన్నిధిలో.. హరిహరుల రథశాలలు

ABOUT THE AUTHOR

...view details