భవిష్యత్తులో యాదాద్రి క్షేత్రానికి భక్తుల రాక ఊహకందని రీతిలో పెరుగుతుందని అందుకు తగ్గట్లుగా అన్ని వసతులు చేసుకోవాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో యాడ కసరత్తు మొదలుపెట్టింది. పెద్దగుట్టపై ఆలయ నగరిలో కాటేజీల నిర్మాణం కోసం మరో 200 ఎకరాల లేఅవుట్కు సన్నద్ధమవుతోంది. 365 కాటేజీల నిర్మాణాల ప్రణాళిక తయారీపై దృష్టి సారించింది. ఆ క్రమంలోనే హైదరాబాద్లోని ఆర్ అండ్ బీ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ కార్యాలయంలో రెండు రోజులుగా కీలక చర్చలు కొనసాగుతున్నాయి.
కార్యాచరణ ఇది...
- యాదాద్రిలో ఆలయాల పునర్నిర్మాణ పనులు పూర్తి కావొస్తుండగా... ప్రస్తుతం మౌలిక వసతుల కల్పనపై యాడ దృష్టి సారించింది. గత ఆదివారం యాదాద్రిలో సీఎం పర్యటించి పలు సూచనలు చేయడంతో వాటి కార్యాచరణకు కసరత్తు చేస్తోంది.
- సాంకేతిక కమిటీ రెండు రోజుల్లో కీలక సమావేశం కానుంది.
- చిన్న జీయర్ స్వామిని కలిసి పలు సూచనలు పొందాలని నిర్ణయించింది.
- కొండ దిగువన గండి చెర్ల ప్రాంగణంలో భక్తుల పుణ్య స్నానాలకు పుష్కరిణీ, తలనీలాలు సమర్పించేందుకు కల్యాణ కట్ట నిర్మాణాలు వేగవంతం చేయనున్నారు.
- కొండ చుట్టూ వలయ దారిని క్షేత్ర స్థాయికి తగ్గట్లు శోభాయమానంగా తీర్చిదిద్దేందుకు ఆర్ అండ్ బీ ఉద్యానవన శాఖలు కృషి చేయనున్నాయి.
- శివాలయం ఎదుట మెట్లదారిలో భారీ నంది విగ్రహ స్థాపనకు రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామిని సంప్రదించనున్నారు.
- అష్టభుజ మండప ప్రాకారాల చుట్టూ నాలుగు అడుగుల ఎత్తులో ఇత్తడి గ్రిల్స్ ఏర్పాటు చేయనున్నారు.
- మండపాల పైకప్పు, మాడ వీధుల్లో ఫ్లోరింగ్ సామర్థ్యం పరిశీలనకు నిపుణులను రప్పించనున్నారు.
- నలువైపులా గల రాజగోపురాల ద్వారాలకు బంగారు తొడుగుల అమరికపై స్వర్ణకారులతో చర్చించి... వ్యయం అంచనాలను ఈ నెలాఖరులోగా రూపొందించే అవకాశాలు ఉన్నాయి.
- క్షేత్ర పరిసరాలను హరితమయం చేసేందుకు... సీఎంవో అధికారి భూపాల్రెడ్డి సూచనలతో 108 రకాల మొక్కలు నాటే పనులు వేగవంతం చేయాలని నిర్ణయించారు.