తెలంగాణ

telangana

ETV Bharat / state

యాదాద్రిలో రథశాల, గ్రీనరీ, ఎస్కలేటర్‌ పనులు

యాదాద్రి దివ్యక్షేత్రం అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఆలయ పరిసరాలన్నీ పచ్చదనం ఉట్టిపడేలా గ్రీనరీ, మొక్కల పెంపకం చేపడుతున్నారు. ప్రధానాలయంలో ప్రత్యేక రథశాల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వృద్ధులు, నడవలేని వారి కోసం ఎస్కలేటర్‌ను ఆధ్యాత్మికంగా రూపొందిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటనకు వచ్చేలోగా అన్ని పనులు పూర్తి చేయాలని యాడా(యాదాద్రి ఆలయ అభివృద్ధి ప్రాధికారిక సంస్థ) భావిస్తోంది.

By

Published : Feb 27, 2021, 7:43 AM IST

yadadri, cm kcr
యాదాద్రి, సీఎం కేసీఆర్‌

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. అందులో భాగంగా ప్రధానాలయానికి ఉత్తరం వైపున గ్రీనరీ, మొక్కల పెంపకం చేపడుతున్నారు. ఆలయ పరిసరాల్లో ప్రత్యేక శోభ సంతరించుకునేలా, పచ్చదనం ఉట్టిపడేలా.. భక్తులకు ఆహ్లాదాన్ని కలిగించే విధంగా ల్యాండ్ స్కేపింగ్‌తో పాటు పొగడ మొక్కలు నాటుతున్నారు. ఇటీవల యాదాద్రి అభివృద్ధి పనుల పరిశీలనకు వచ్చిన సీఎంఓ భూపాల్ రెడ్డి సూచనల మేరకు ప్రధానాలయం పరిసరాల్లో గ్రీనరీతో పాటు మొక్కల పెంపకం చేపట్టారు.

మందిర రూపంలో రథశాల

ప్రధానాలయ ప్రాంగణంలో స్వామి వారి దివ్యవిమాన రథాన్ని భద్రపరిచేందుకు నిర్మితమవుతోన్న ప్రత్యేక రథశాలను.. మందిర రూపంలో తీర్చిదిద్దేందుకు యాడా ప్రత్యేక దృష్టి సారించింది. సుమారు 30 అడుగుల ఎత్తులో ఏర్పాటయ్యే రథశాలకు వైష్ణవతత్వం ప్రస్ఫుటించేలా స్థూపాలు, స్వాగత తోరణాలు ఆవిష్కృతం కానున్నాయి. ప్రత్యేకంగా రూపొందించిన బంగారు, వెండి తొడుగులను ఆలయానికి చేర్చారు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తుల్లో నడవలేని వారి కోసం ఏర్పాటవుతున్న ఎస్కలేటర్‌ను సైతం ఆధ్యాత్మికంగా రూపొందిస్తున్నారు.

పూర్తవుతోన్న రథశాల, గ్రీనరీ పనులు

సారొచ్చేలోగా..

సీఎం కేసీఆర్.. యాదాద్రి పర్యటనకు వచ్చేలోగా రథశాల, ఎస్కలేటర్ పనులతో సహా ఇతరత్రా కట్టడాలన్నింటినీ పూర్తి చేయాలని సీఎంఓ ఆదేశించారు. ఆ దిశగా యాడా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఇదీ చదవండి:దివ్య విమాన రథంలో ఊరేగిన నారసింహుడు

ABOUT THE AUTHOR

...view details