లాక్డౌన్ కారణంగా గత రెండు నెలలుగా ఖాళీగా కనిపించిన యాదాద్రి ఆలయం నేడు భక్తులతో కిటకిటలాడింది. సెలవుదినం కావడంతో పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చిన భక్తులు అభిషేకం, సుదర్శన నారసింహ హోమం, నిత్యకళ్యాణం, సువర్ణ పుష్పార్చన పూజలు, అష్టోత్తర పూజల్లో పాల్గొన్నారు.
దర్శనానికి గంట సమయం
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకోవడం కోసం భక్తులు పోటెత్తడంతో ఆలయ వ్రతమండపంలోని క్యూలైన్లు నిండిపోయాయి. సుమారు 25 వేల మంది స్వామివారి దర్శనం కోసం ఆలయాన్ని సందర్శించారని ఆలయ సిబ్బంది తెలిపారు. రద్దీ కారణంగా స్వామివారిని దర్శించుకోవడానికి గంట సమయం పట్టిందని భక్తులు చెప్పారు.