యాదాద్రి భువనగిరి జిల్లా కుర్రారం గ్రామానికి చెందిన ముక్కెర రవీందర్ రెడ్డి కుటుంబంతో హైదరాబాద్లో నివాసముంటున్నారు. వారికి కుర్రారం గ్రామంలో వ్యవసాయ పొలం ఉంది. విత్తనాలు వేసే సమయం అయినందున వారు స్వగ్రామానికి వచ్చారు. ఈ క్రమంలో రవీందర్ రెడ్డి ఆయన కుమారుడు జీవన్ రెడ్డితో కలిసి వ్యవసాయ పొలంలో సాగు పనులు చేపట్టారు. పనులు పూర్తి అయిన తర్వాత సాయంత్రం పొలం నుంచి తిరిగి ఇంటికి వస్తుండగా కల్వర్టు వద్ద ట్రాక్టర్ ఇంజిన్ బోల్తా పడి వారిపై పడింది. ఈ ప్రమాదంలో రవీందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, జీవన్ రెడ్డి ఆసుపత్రికి తరలించే సమయంలో మరణించాడు. తండ్రీకొడుకులు మృతి చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.