తెలంగాణ

telangana

By

Published : Jan 29, 2022, 1:38 PM IST

Updated : Jan 29, 2022, 3:21 PM IST

ETV Bharat / state

యువజన కాంగ్రెస్​ ఆందోళన.. ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడి

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలంటూ కాంగ్రెస్​ ఆందోళన చేపట్టింది. పలు జిల్లాల్లో యువజన కాంగ్రెస్​ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. భువనగిరి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ముట్టడించారు.

congress
congress

రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణులు నిరసనకు దిగారు. హైదరాబాద్‌ గన్‌పార్క్‌ నేతలు మౌనదీక్ష చేపట్టారు. అమరవీరుల స్థూపం వద్ద రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ దీక్ష చేశారు. ఇందులో సీనియర్‌ నేతలు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, కోదండరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

హైదరాబాద్ హైదర్​గుడాలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను ముట్టడించారు. ర్యాలీగా వచ్చిన నేతలు... లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్​రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత తలెత్తింది. తెరాస కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముట్టడికి వచ్చిన కాంగ్రెస్, ఎన్​ఎస్​యూఐ శ్రేణులను... సాగర్​ రహదారి వరకు తెరాస కార్యకర్తలు వెంబడించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన తమపై దౌర్జన్యానికి దిగిన తెరాస శ్రేణులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. యూత్ కాంగ్రెస్ నేతలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.

ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ.. సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చాలంటూ ఆందోళన చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళకారులను అదుపులోకి తీసుకున్నారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ జెండా ప్రదర్శించారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

యాదాద్రి జిల్లా భువనగిరిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నించారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన శ్రేణులు...కార్యాలయంపై కాంగ్రెస్‌ జెండాలు ప్రదర్శించారు. నిర్మల్‌లో ముందస్తుగా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమ అరెస్టులను శ్రేణులు ఖండించారు. పరిగి ఎమ్మెల్యే ఇంటిని కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడించారు. లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

హనుమకొండలో యూత్‌ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగ నోటిఫికేషన్ జారీచేయాలని కోరుతూ హనుమకొండలోని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్​ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.

ఇదీచూడండి:KTR Rangareddy Tour : 'ప్రజల ప్రగతే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం'

Last Updated : Jan 29, 2022, 3:21 PM IST

ABOUT THE AUTHOR

...view details