యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టనున్నారు. దీనికి సంబంధించి చెక్పోస్ట్ నుంచి మొదటి ఘాట్ రోడ్డు వరకు ఉన్న ఇళ్ల స్థలాలు కోల్పోయే వారితో గతంలో అదనపు కలెక్టర్, ఈఈలు సమావేశమయ్యారు. రహదారి మధ్య నుంచి 55 ఫీట్లు తీసుకుంటామని చెప్పగా బాధితులు అంగీకరించారు.
యాదాద్రిలో రోడ్డు విస్తరణ పనులను అడ్డుకున్న స్థానికులు - road expansion works got stopped in yadadri district
యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి ఆలయ అభివృద్ధిలో భాగంగా రోడ్డు విస్తరణ కోసం రహదారులను కొలవడానికి వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ముందుగా చెప్పిన దానికంటే 30 ఫీట్లు అదనంగా తమ స్థలాన్ని తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆర్డీఓ ఆదేశాల మేరకు శుక్రవారం స్థలాన్ని కొలవడానికి వచ్చిన ఈఈ శంకరయ్య, డీఈ బిల్యనాయక్, తహసీల్దార్ అశోక్. ఆర్ అండ్ బీ సిబ్బంది అదనపు స్థలానికి కొలతలు వేశారని స్థానిక బాధితులు అడ్డుకున్నారు. రహదారి విస్తరణలో చేపట్టనున్న క్యారేజ్ వే బ్రిడ్జి కోసం అదనంగా 30 ఫీట్లకు కొలతలు వేశారని ఆందోళన వ్యక్తం చేశారు.
55 ఫీట్ల వల్ల తమ ఇళ్ల స్థలం కొంత భాగం మాత్రమే కోల్పోతామని అందుకే ఒప్పుకున్నామని, కానీ ఇప్పుడు 85 ఫీట్ల వల్ల ఎక్కువ భాగం కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన చెందారు. అదనంగా విస్తరణ చేపట్టి తమను ఇబ్బందికి గురి చేస్తున్నారని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
- ఇదీ చదవండి:పరిమితి సమయాల్లోనే హైదరాబాద్ మెట్రో సేవలు