తెలంగాణ

telangana

Delivery in Ambulance: అంబులెన్స్​లోనే ప్రసవం.. పురుడు పోసిన 108 సిబ్బంది

By

Published : Dec 11, 2021, 8:50 PM IST

నెలలు నిండిన గర్భిణికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్స్​ రానే వచ్చింది. కానీ.. లోపలున్న బిడ్డ బయటికొచ్చేందుకు తెగ తొందరపడుతున్నాడు. లోపలున్న బిడ్డ తొందరకు.. ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. ఆస్పత్రి చేరుకోవటానికి ఇంకా చాలా దూరం ఉంది. ఆ తల్లి పడుతున్న ప్రసవ వేదనను చూడలేక.. సిబ్బంది ఏం చేశారంటే..?

Delivery in Ambulance: అంబులెన్స్​లోనే ప్రసవం.. పురుడు పోసిన 108 సిబ్బంది
Delivery in Ambulance: అంబులెన్స్​లోనే ప్రసవం.. పురుడు పోసిన 108 సిబ్బంది

ప్రాణం పోసే వాడు దేవుడు.. ఆ ప్రాణాలు నిలబెట్టేవాడు వైద్యుడు.. అంటారు. అదే ప్రాణం కొట్టుమిట్టాడుతున్న సమయంలో.. సురక్షితంగా కాపాడినప్పుడు ఆ వైద్యుడినే దేవుడని కొనియాడుతారు. ఇక్కడ ఆ కుటుంబానికి మాత్రం అంబులెన్స్​ సిబ్బందే వైద్యదేవుళ్లయ్యారు.

అంబులెన్స్​ సిబ్బందే వైద్యుల్లా మారారు. పండంటి బిడ్డకు పురుడు పోసి.. రెండు ప్రాణాలు కాపాడారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్​ మండలం జైనపల్లికి చెందిన పొట్ట రాణికి నెలలు నిండాయి. ఉదయం పూట నొప్పులు వచ్చాయి. నొప్పులు తీవ్రంకావటంతో.. ఆస్పత్రికి వెళ్లేందుకు కుటుంబసభ్యులు అంబులెన్స్​కు ఫోన్​ చేశారు. హుటాహుటిన జైనపల్లికి చేరుకున్న 108 అంబులెన్స్​.. రాణిని జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించేందుకు పయనమైంది.

ధైర్యం చెప్తూ..

మార్గమధ్యలో రాణికి నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. రాణి తల్లడిల్లిపోతోంది. ఆమెతో ఉన్న వాళ్ల అమ్మ బిడ్డ పడుతున్న బాధ చూడలేక నమ్ముకున్న దేవుళ్లందరికీ మొక్కుతోంది. అంబులెన్స్​లో ఉన్న సిబ్బంది అప్పటికీ.. ఇద్దరికీ ధైర్యం చెబుతూనే ఉన్నారు. అయినా.. వాళ్లు చెప్పే ధైర్యం ఆ పురిటినొప్పుల బాధను తట్టుకునే శక్తిని రాణికి ఇవ్వలేకపోతున్నారు. ఆస్పత్రి చేరుకునేందుకు ఇంకా సమయం పడుతుంది. బాధితురాలేమో.. తట్టుకలేకపోతోంది. ఈ సన్నివేశం చూస్తున్న సిబ్బందికి.. లోలోపల మనసు కలిచివేస్తున్నా.. పైకి అదేమీ కనిపించకుండా.. ధైర్యం చెబుతున్నారు.

సురక్షితంగా పురుడు పోసి..

ఆమె బాధను చూడలేక.. తల్లడిల్లిపోతున్న రాణికి పురుడు పోయటమే వారి ముందున్న లక్ష్యమని ఆ సిబ్బంది నిర్ణయించుకున్నారు. తమకు తాము ధైర్యం చెప్పుకున్నారు. అంబులెన్స్​ సిబ్బంది కాస్తా.. వైద్యుల్లా మారిపోయారు. వారికున్న పరిజ్ఞానంతో.. వనితకు అంబులెన్స్​లోని సుఖప్రసవం చేశారు. ఈ కాన్పులో పండంటి మగబిడ్డకు పొట్ట రాణి జన్మనిచ్చింది. సమయానికి సరైన నిర్ణయం తీసుకుని.. ఆ సిబ్బంది రెండు నిండు ప్రాణాలు కాపాడారు. ఇద్దరు క్షేమంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తదుపరి వైద్య సేవల నిమిత్తం.. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు పరీక్షించి.. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఆసుపత్రి వర్గాలు 108 సిబ్బందిని అభినందించారు.

ఇదీ చదవండి:

IMA Passing Out Parade 2021: ఆ కుటుంబంలో మూడు తరాల సైనికులు.. ఇప్పుడు ఇంకొకరు సైన్యంలోకి..

ABOUT THE AUTHOR

...view details