తెలంగాణ

telangana

ETV Bharat / state

Rain Effect : ఉప్పొంగుతున్న వాగులు.. దాటారంటే అంతే సంగతులు - flood effect in yadadri district

విరామం లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి నల్గొండ జిల్లా అతలాకుతలమవుతోంది. జిల్లా వ్యాప్తంగా వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. రహదారులన్నీ జలమయమయ్యాయి. వంతెనలపై నుంచి వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు తమ గ్రామాలకు వెళ్లేందుకు వాగులు దాటడానికి ప్రయత్నిస్తూ ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. వాగులు, వంతెనలపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తున్నప్పుడు వాటి నుంచి వెళ్లకపోవడమే శ్రేయస్కరమని అధికారులు సూచిస్తున్నారు.

ఉప్పొంగుతున్న వాగులు
ఉప్పొంగుతున్న వాగులు

By

Published : Sep 5, 2021, 1:50 PM IST

Updated : Sep 5, 2021, 2:15 PM IST

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా గత రెండు దశాబ్దాల్లో నమోదు కాని రీతిలో వాగుల్లో వరద పోటెత్తుతోంది. ఉపరితల ఆవర్తనం, షేర్ జోన్ ప్రభావంతో ఆదివారం నుంచి మంగళవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ సమాచారాన్ని బట్టి ఉద్ధృతి మరింత పెరిగే సూచనలున్నాయి. వంతెన(కాజ్ వే)ల పై నుంచి నీరు పారుతున్న సమయంలో ప్రజలు రాకపోకలు కొనసాగిస్తూనే ఉన్నారు. దీనివల్ల తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వంతెన మీదుగా పారే నీరు మామూలు వరదలా కనిపిస్తున్నా లోపల నీటి ఒత్తిడి తీవ్రంగా ఉంటుందని చెబుతున్నారు. దానిపై నుంచి నడిచి వెళ్లే సమయంలో ఆ ఒత్తిడి తట్టుకోలేక కొట్టుకుపోతున్నారు.

వరుస ప్రమాదాలు..

  • వారం రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాలతో చెరువులు అలుగు పోస్తుండగా, వాగులు భీకరంగా ప్రవహిస్తున్నాయి. యాదాద్రి జిల్లా గత నెల 29న చండూరు మండలం శిర్దేపల్లికి వచ్చి తిరిగివెళ్తుండగా ఇద్దరు యువకులు అక్కడి వాగులో కొట్టుకుపోయారు. పిల్లరు, కంపచెట్టు పట్టుకుని వేలాడుతుండగా అక్కడున్న మూడో వ్యక్తి గ్రామస్థులను తీసుకురావడంతో బాధితులను రక్షించగలిగారు.
  • రాజపేట మండలం కుర్రారం గ్రామ శివారులోని దోసలవాగు వద్ద నీటి ప్రవాహానికి గత నెల 30న ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. ఘటన జరిగిన రోజు సాయంత్రం ఒకరిని గుర్తించగా, నాలుగు రోజుల గాలింపు తర్వాత మరో యువతి మృతదేహం లభ్యమైంది.
  • ఈ నెల 3న నాంపల్లి మండలం నర్సింహులగూడెం నుంచి చండూరు మండలం చామలపల్లికి వెళ్తుండగా.. జింకలవంపు వాగు వద్ద మోటార్ సైకిల్ అదుపుతప్పి ఇద్దరు యువకులు కొట్టుకుపోయారు. అక్కడే ఉన్న నర్సింహులగూడెం వాసులు తాళ్ల సాయంతో బాధితులను రక్షించి ఒడ్డుకు చేర్చారు. వాహనం మాత్రం కనిపించకుండా పోయింది. ఆ సమయంలో స్థానికులు లేకుంటే మాత్రం ఆ ఇద్దరి ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

జాగ్రత్తలు తప్పనిసరి

చిన్న చిన్న వంతెనలు దాటేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి వరదలు పోటెత్తినప్పుడు వంతెన మీదుగా వెళ్లకపోవడమే మంచిదని నీటిపారుదల, రహదారుల శాఖల అధికారులు చెబుతున్నారు.

ముందస్తు ఏర్పాట్లు

కల్వర్టులు, వంతెనల వద్ద రహదారుల శాఖ ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలి. వరద ఉద్ధృతి సమయంలో స్థానికులను అప్రమత్తం చేయాలి. కల్వర్టుల కింద గల పైపుల్లో కంప చెట్లు ఇరుక్కుపోతే వాటిని తొలగించాలి. ఇక గైడ్ పోస్టులు వంతెనకు అటుఇటు ఉండాలి. గైడ్ పోస్టులుగా పిలుచుకునే దిమ్మెల ఆధారంగానే నీటి ప్రవాహాన్ని అంచనా వేయవచ్చు. వాస్తవానికి ప్రతి వంతెన వద్ద ఫ్లడ్ గేజ్ అందుబాటులో ఉంచాలి. కానీ నిధుల లేమి వల్ల అది సాధ్యపడటం లేదు. మునుగోడు నియోజకవర్గంలో 8 చోట్ల వాగులు భీకరంగా పారుతున్నాయి. అలాంటి ప్రాంతాల్లో స్థానికులను అధికారులు అప్రమత్తం చేశారు. వరద ఉద్ధృతి వల్ల ఇప్పటికే పలు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి.

ఎప్పుడూ చూసిందే కదా దాటితే ఏమవుతుందన్న ధీమాతోనే చాలా మంది ప్రమాదాల బారిన పడుతున్నారని అధికారులు చెబుతున్నారు. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నప్పుడు.. వంతెనలపై భారీ వరద చేరినప్పుడు.. వాటిపై నుంచి వెళ్లకపోవడమే శ్రేయస్కరమని సూచిస్తున్నారు.

Last Updated : Sep 5, 2021, 2:15 PM IST

ABOUT THE AUTHOR

...view details