తెలంగాణ

telangana

Yadadri: యాదాద్రిలో మూడోరోజు వైభవంగా పంచకుండాత్మక మహాయాగం

Yadadri Mahakumbha Samprokshana: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ఉద్ఘాటన క్రతువు మూడోరోజు కొనసాగుతోంది. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా పంచకుండాత్మక మహాయాగం.. రుత్వికులు, పండితుల, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో కన్నుల పండువగా జరుగుతోంది. పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా క్రతువులు చేపట్టారు. బాలాలయంలో నిత్యారాధనల అనంతరం శాంతిపాఠం, చతుస్థానార్చనలు, ద్వార తోరణ ధ్వజకుంభారాధనలు, మూల మంత్ర జపాలు, మూల మంత్ర హవనాలు నిర్వహించారు.

By

Published : Mar 23, 2022, 12:59 PM IST

Published : Mar 23, 2022, 12:59 PM IST

Updated : Mar 23, 2022, 3:21 PM IST

Yadadri Mahakumbha Samprokshana
యాదాద్రిలో మహాకుంభ సంప్రోక్షణ

Yadadri Mahakumbha Samprokshana: యాదాద్రి ఆలయ ఉద్ఘాటన పర్వంలో భాగంగా మూడో రోజు పూజా పంచకుండాత్మక మహాయాగం కార్యక్రమాలు.. అర్చకులు, ఆలయ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా ఉదయం బాలాలయంలో యగశాలలో శాంతి పాఠం, ద్వారతోరణ, ధ్వజకుంభారాధన, మూలమంత్ర, మూర్తి మంత్ర హవనములు నిర్వహించారు. స్వయంభు ప్రధానాలయంలో షోడశకలశాభిషేకం నిర్వహించారు. తదుపరి నిత్య లఘు పూర్ణాహుతి బాలాలయంలో నిర్వహించారు. ఆగమ శాస్త్రానుసారం ఆలయ అర్చకులు ఈ వేడుకలును నిర్వహించారు.

యాదాద్రిలో మూడోరోజు వైభవంగా పంచకుండాత్మక మహాయాగం

కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి, ఈవో గీతా రెడ్డి, అర్చకులు పాల్గొన్నారు. స్వయంభు ప్రధానాలయంలో నిర్వహించిన షోడశకలశాభిషేకం ప్రత్యేకమైంది. బింబ అంతర్గతమైన సర్వరోగ నివారణకై షోడశ గుణానుభవంతో, షోడశ కలశాలతో శుద్ధోదకములతో పాటు, వనస్పతి దేవతలకు సంబంధించిన ఓషదులతో, గోమూత్రాది పంచామృతాలతో అభిమంత్రించి, కలశ అంతర్గతమైన ఆయా దేవతలను, మంత్రాలతో ఆవాహన గావించారు. బింబ సంప్రోక్షణతో ఈ పూజలు నిర్వహించారు.

యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా నిర్వహిస్తున్న పంచకుండాత్మక మహాయాగం మూడోరోజు వైభవంగా కొసాగుతోంది. ఉదయం 9గంటలకు యాగశాలలో శాంతి పాఠం, ద్వారతోరణం కార్యక్రమాలను చేపట్టారు. ధ్వజకుంభరాధనలు, చతుస్థానార్చనతో పాటు మూల మంత్రహావనములు, షోడష కలశాభిషేకం, నిత్యలఘుపుర్ణాహుతి ఘనంగా జరుగుతున్నాయి.

సాయంత్రం సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం జరగనుంది. యాగశాలలో ద్వారాతోరణ ధ్వజకుంభ ఆరాధనలు, పంచగవ్యాధి వాసం, నిత్య లఘు పూర్ణాహుతి నిర్వహించనున్నారు. మరో నాలుగురోజుల పాటు ఈ మహాయాగం జరగనుంది. 28న పూర్ణాహుతి, మహాకుంభ సంప్రోక్షణ అనంతరం ఆ రోజు మధ్యాహ్నం నుంచి భక్తులకు స్వయంభువుల దర్శనం కల్పించనున్నారు. మహాకుంభ సంప్రోక్షణలో ముఖ్యమంత్రి కేసీఆర్​ పాల్గొంటారు.

ఇదీ చదవండి:బోయగూడ ఘటనపై ప్రముఖుల దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పీఎం, సీఎం పరిహారం

Last Updated : Mar 23, 2022, 3:21 PM IST

ABOUT THE AUTHOR

...view details