రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా హజీపూర్ వరుస హత్యల కేసులో నిందితుడు శ్రీనివాస రెడ్డిని ఉరి తీయాలంటూ గ్రామస్థులు కోరుతున్నారు. ఈ కేసుకు సంబంధించి గతంలో ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణను పూర్తి చేసింది. ప్రాసిక్యూషన్ కూడా నిందితుడు శ్రీనివాస్ రెడ్డి... ఉరిశిక్షను అన్ని విధాలా అర్హుడని వాదించింది. కేవలం తన లైంగిక వాంఛలు తీర్చుకోవడం కోసమే మూడు హత్యలు చేసిన వ్యక్తి సమాజంలో ఉండటం శ్రేయస్కరం కాదని ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది తెలిపారు. కానీ కోర్టు తీర్పును ఫిబ్రవరి 6వ తేదీకి వాయిదా వేయడం వల్ల హాజీపూర్ గ్రామస్థులంతా తీవ్ర నిరాశ చెందారు.
ఎంతో ప్రశాంతగా ఉండే ఊళ్లో శ్రీనివాసరెడ్డి అనే ఓ నరరూప రాక్షసుడు ముగ్గరు బాలికలను పొట్టనబెట్టుకున్నాడు. ఊరి చివర తన పొలంలో కాపు కాచి స్కూలు నుంచి, కళాశాలల నుంచి వస్తున్న బాలికలను లక్ష్యంగా చేసుకొని... తన బండి మీద లిఫ్ట్ ఇస్తానంటూ బావి వద్దకు తీసుకువ వచ్చి అత్యాచారం... ఆపై హత్య చేశాడు. అలాంటి వాడికి వెంటనే ఉరిశిక్ష అమలు చేయాలని బంధువులు, గ్రామస్థులు కోరుతున్నారు.