యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల పరిధిలోని జక్కుల చెరువులో చుక్క నీరు లేక బోసిపోయింది. ఫలితంగా చెరువునే నమ్ముకుని జీవనం సాగిస్తోన్న మత్స్యకారులు ఆర్థికంగా కుదేలయ్యారు. గ్రామంలో ఉపాధి కరవై పట్టణాల బాట పడుతున్నారు. పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు వలస పోతున్నారు.
గ్రామస్థుల ఇక్కట్లు..
ఓవైపు అన్ని గ్రామాల్లో కాలువలు, వర్షపు నీటి ద్వారా వచ్చిన నీటితో వాగులు, వంకలు, చెరువులు, కాల్వలు జలకళ సంతరించుకున్నాయి. మరోవైపు గొలనుకొండలోని జక్కుల చెరువు మాత్రం వాటికి భిన్నంగా ఎండిపోయింది. ఫలితంగా ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
50 కుటుంబాలు కుదేలు
గ్రామంలోని మత్స్యకార కుటుంబాలు, సుమారు 40 వేల రూపాయలు ఖర్చుచేసుకుని చెరువులోని కంప చెట్లను తొలగించారు. పూర్థి స్థాయిలో చెరువుకు మరమ్మతు నిర్వహించాల్సి ఉంది. గ్రామంలో సుమారు 50 మత్స్యకార కుటుంబాలున్నప్పటికీ నీటి వసతి లేక నిరుపయోగంగా మారింది. వ్యవసాయం కూడా ఇబ్బందిగానే ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. నీటి వసతులు లేక బావులు ఎండిపోయాయి. తూర్పు గూడెం నుంచి గొలనుకొండలోని జక్కుల చెరువుకు నీరు రావాల్సి ఉందని... స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత , ఎంపీ కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి చొరవ తీసుకోవాలని గంగపుత్ర సంఘం ప్రధాన కార్యదర్శి వంగాల మధు బెస్త విజ్ఞప్తి చేశారు.