యాదాద్రి భువనగిరి జిల్లాలో రైతు వేదికల నిర్మాణాలు ఆలస్యం కావడంపై కలెక్టర్ అనితా రామచంద్రన్.. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజాపేట మండలంలో నిర్మాణ పనులను ఆమె ఆకస్మికంగా పరిశీలించారు. నిర్మాణాలు జరగకపోవడాన్ని చూసి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
మండలంలోని నాలుగు క్లస్టర్లలో చేపట్టిన నిర్మాణాలు పునాది దశలోనే ఉండటం చూసి ఇందుకు బాధ్యులైన అధికారులపై చర్యలు తప్పవని అనిత హెచ్చరించారు. ఈ స్థాయిలో నిర్మాణాలు ఉంటే దసరా లోపు ఏ విధంగా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. నిర్మాణ కార్మికులను రప్పించే వరకు ఇక్కడే ఉంటానని కలెక్టర్ అనడంతో అధికారులు హుటాహుటిన కార్మికులను తీసుకొచ్చి పనులు మొదలు పెట్టారు.