తెలంగాణ

telangana

Bhoodan Pochampally: ఖండాంతరాలు దాటిన ఖ్యాతి.. ప్రపంచ పర్యాటక గ్రామంగా 'భూదాన్ పోచంపల్లి'

పల్లెలు మెరవాలి. అక్కడా అభివృద్ధి కనిపించాలి. మహాత్మాగాంధీ కల ఇది. పూర్తి స్థాయిలో కాకపోయినా.. ఇప్పుడు గ్రామాల్లోనూ పురోగతి కనిపిస్తోంది. గతంతో పోల్చుకుంటే.. మారుమూల ప్రాంతాలకూ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. ఈ క్రమంలో కొన్ని పల్లెలు అభివృద్ధి ఎల్లలు చెరిపేస్తున్నాయి. వారసత్వంగా వచ్చిన కళల్ని, ప్రత్యేకతల్ని విస్మరించకుండా.. వాటితోనే అద్భుతం చేస్తున్నారు... ఆయా పల్లెల ప్రజలు. తెలంగాణలోని యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి గ్రామస్థులూ ఇదే చేశారు. చేనేతను నమ్ముకొని జీవనం సాగిస్తున్న వీరు...ఈ కళతోనే పేరు గడించారు. పోచంపల్లి చీరలు అంతర్జాతీయంగా ఆదరణ పొందటం.. వారి నైపుణ్యానికి నిదర్శనం. ఇప్పటికే సిల్క్ సిటీ ఆఫ్ ఇండియాగా ఖ్యాతి గడించిన పోచంపల్లి (bhoodan pochampally news ) కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. ప్రపంచ ఉత్తమ పర్యాటక గ్రామంగా అత్యున్నత పురస్కారం లభించింది. మహోన్నత సాంస్కృతిక వారసత్వమున్న ఈ పల్లెసీమ ఖ్యాతి... ఖండాంతరాలు దాటనుంది.

By

Published : Nov 18, 2021, 6:51 PM IST

Published : Nov 18, 2021, 6:51 PM IST

Bhoodan Pochampally
Bhoodan Pochampally

Bhoodan Pochampally: ఖండాంతరాలు దాటిన ఖ్యాతి.. ప్రపంచ పర్యాటక గ్రామంగా 'భూదాన్ పోచంపల్లి'

మగ్గం చప్పుళ్లతో నిత్యం మారుమోగే పల్లెసీమ. తెలంగాణ సంప్రదాయానికి అద్దంపట్టే చారిత్రక చేనేత వారసత్వ సంపదకు చిరునామా. అంతరించిపోతుందన్న కళను అంతర్జాతీయ స్థాయికి చేర్చిన అలుపెరగని శ్రమ. ఇవన్నీ కలగలిపితే...భూదాన్ పోచంపల్లి. పట్టుచీరలకు పుట్టినిల్లుగా ప్రఖ్యాతి గాంచిన ఈ ఊరికి ఘన చరిత్రే ఉంది. అద్భుతమైన వస్త్ర కళా రూపం ఇక్కత్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది (bhoodan pochampally got international recognition) పోచంపల్లి చేనేత కార్మికులే. ఈ వస్త్రాలకు పేటెంట్ కూడా పొందింది ఈ గ్రామం. ఇక్కడ నేసే చీరలు ఎంతో నాణ్యమైనవిగా పేరు పొందాయి. ఇది గ్రామమే అయినా సిల్క్ సిటీగా గుర్తింపు పొందింది. ఇప్పుడీ పల్లె గుర్తింపు.. అంతర్జాతీయ స్థాయికి విస్తరించనుంది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ.. ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక చేసింది.

ప్రపంచ పర్యాటక గ్రామంగా..

గ్రామీణ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (unwto selects bhoodan pochampally) ఆధ్వర్యంలో ఉత్తమ పర్యాటక గ్రామం పోటీ నిర్వహిస్తుంది. సాంఘిక, ఆర్థిక, పర్యావరణ రంగాల్లో సుస్థిరాభివృద్ధి ఉందా..? గ్రామీణ సాంస్కృతిని ఎలా పరిరక్షిస్తున్నారు. గ్రామీణ పర్యాటకానికి ఎంత అవకాశముంది..! ఇలా మొత్తం 9 అంశాలు పరిగణనలోకి తీసుకొని.. అందుకు అర్హత ఉన్న గ్రామాలను ఆ జాబితాలో పొందు పరుస్తారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించటం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించటం, సంప్రదాయాల పరిరక్షణ, వాటిని భావితరాలకు అందించటం, ఆర్థిక అసమానతలు రూపుమాపటం ఈ పోటీ ఉద్దేశం. అత్యుత్తమ విధానాలు అవలంబిస్తూ గ్రామీణ గమ్యస్థానాలుగా మారిన ప్రాంతాలకు ఉత్తమ పర్యాటక గ్రామాల అవార్డులు ఇస్తారు. భూదాన్ పోచంపల్లి గ్రామం ఈ అన్ని అంశాలకూ అనుగుణంగా ఉండటం వల్ల ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపికైంది.

డిసెంబరు 2న అవార్డు..

బహిరంగ మార్కెట్‌లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకొనేలా స్థానికులకు శిక్షణ ఇచ్చి గ్రామీణ పర్యాటక సామర్థ్యం పెంచడం ఈ పోటీ ప్రధాన లక్ష్యం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భారత్‌ నుంచి 3 గ్రామాలను ఈ అవార్డుకు ప్రతిపాదించింది. ఇందులో మేఘాలయలోని కోంగ్‌థాంగ్‌, మధ్యప్రదేశ్‌లోని లాధ్‌పురా ఖాస్‌, తెలంగాణలోని పోచంపల్లి ఉన్నాయి. ఇందులో పోచంపల్లి (Pochampally best tourism villages by unwto) ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కించుకుంది. ఎంపికైన గ్రామాలను అభివృద్ధి చేయటం, మరింత గుర్తింపు తీసుకురావటం లాంటివి లక్ష్యంగా పెట్టుకుంది...ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ పర్యాటక సంస్థ. డిసెంబరు 2న స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో జరిగే యూఎన్​డబ్ల్యూటీవో (UNWTO) జనరల్‌ అసెంబ్లీ 24వ సమావేశం సందర్భంగా ఈ అవార్డు అందజేయనున్నారు. ఈ పురస్కారం దక్కటం పట్ల స్థానికంగానే కాక... రాష్ట్రవ్యాప్తంగా ఆనందం వెల్లివిరుస్తోంది.

పోచంపల్లిలో 65 శాతం చేనేత కార్మికులే..

హైదరాబాద్‌కు 45 కిలోమీటర్ల దూరంలోని భూదాన్‌ పోచంపల్లి గ్రామ ప్రజల (Bhoodan Pochampally speciality) ప్రధాన వృత్తి చేనేత. టై అండ్‌ డై విధానంలో రంగురంగుల డిజైన్‌లతో చీరలు, వస్త్రాలు తయారు చేయడంలో దిట్టలైన ఇక్కడి చేనేత కళాకారుల పనితనం ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ఇక్కత్‌ శైలిలో నేసే చీరలకు 2004లో భౌగోళిక గుర్తింపు కూడా దక్కింది. ఇప్పుడు పర్యాటక గ్రామంగా ఎంపిక కావటం వల్ల మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక నిధులు కేటాయించనున్నాయి. ఫలితంగా విదేశీయుల రాకపోకలు పెరిగి పోచంపల్లి.. ఖండాంతర ఖ్యాతి గడించనుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 5,294 చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ ఉంటే, అందులో సగం భూదాన్ పోచంపల్లిలోనే ఉన్నాయి. గ్రామంలో జనాభాలో 65 శాతం మంది చేనేత కార్మికులే ఉన్నారు. జిల్లాలో ఉన్న చేనేత కార్మికుల్లో అత్యధికం ఇక్కడి వారే.

అప్పటి నుంచి భూదాన్ పోచంపల్లిగా..

ఇటీవలే మున్సిపాలిటీగా అవతరించింది భూదాన్ పోచంపల్లి. సాంప్రదాయ, చేనేత, వ్యవసాయ అనుబంధ రంగాలను నమ్ముకునే ఇక్కడి ప్రజలు జీవనం సాగిస్తున్నారు. 1951లో ఆచార్య వినోబాభావే చేపట్టిన పాదయాత్ర ద్వారా దేశంలో ఒక కొత్త శకానికికి ఈ గ్రామం నాంది పలికింది. ఇక్కడి భూదాత వెదిరె రామచంద్రారెడ్డి వినోబాభావే పిలుపు మేరకు హరిజనులకు 100 ఎకరాల భూమి దానం చేశారు. అనంతరం ఈ కార్యక్రమాలను విస్తృతం చేస్తూ సుమారు 44 లక్షల ఎకరాల భూమిని దాతల నుంచి స్వీకరించి భూమిలేని పేదలకు పంచిపెట్టారు. ఈ గ్రామం భూదానోద్యమంతో భూదాన్ పోచంపల్లిగా మారింది. గ్రామంలో ఓ మ్యూజియం కూడా ఉంది. పర్యాటక శాఖ దీన్ని నిర్వహిస్తుంది. తమ గ్రామం (Bhoodan Pochampally is famous for) ఉత్తమ పర్యాటక గ్రామంగా ఎంపిక కావటం పట్ల అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తద్వారా తమ గ్రామానికి మంచి గుర్తింపుతో పాటు పర్యాటకులు కూడా పెరిగే అవకాశం ఉంటుందని పోచంపల్లి వాసులు భావిస్తున్నారు.

పోచంపల్లి చీరలకు మగువుల మనసులో ప్రత్యేకస్థానం

పోచంపల్లి చీరలకు మగువుల (newbhoodan pochampally sarees speciality) మనసులో ప్రత్యేకస్థానం ఉంది. ఇక్కడి చేనేత కళాకారులు తమ కళా నైపుణ్యాలతో అగ్గిపెట్టెలో పట్టే చీరలు నేసి ఔరా అనిపించారు. అరబ్‌ దేశాలకు తేలియా రుమాళ్లు, గాజులు, పూసలు ఎగుమతి చేసింది ఈ గ్రామం. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న భూదాన్‌ పోచంపల్లి దేశ, విదేశీయులకు అధ్యయన కేంద్రంగా మారింది. భూదానోద్యమ చారిత్రక గాథ, గ్రామీణ పర్యాటక కేంద్రం, చేనేత, చేతివృత్తులతో పాటు కుటీర పరిశ్రమలు, వ్యవసాయానికి నిలయం. అంతేగాక నిరుద్యోగ యువతకు ఉచిత స్వయం ఉపాధి కోర్సులకు శిక్షణ ఇస్తున్న జలాల్‌పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ రాష్ట్రంలోనే పేరు గాంచింది. అందుకే.. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, చైనా, రష్యా తదితర 100 దేశాలకు పైగా వేలాది పర్యాటకులు, విదేశీ ప్రతినిధులు సందర్శించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా గ్రామీణ పర్యాటకాన్ని, అక్కడి ప్రజల జీవన శైలిని వినూత్న పద్ధతిలో ప్రపంచానికి తెలియజేసేందుకు ఐరాస పురస్కారం ఊతమివ్వనుంది.

వెండితెరపై పోచంపల్లి చీరలు..

పోచంపల్లి ఇక్కత్‌ (pochampally ikat news) అంటే ఒక బ్రాండ్‌ ఇమేజ్‌. నేడు అంతర్జాయ మార్కెట్‌లో పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాలకు మంచి ఆదరణ, గుర్తింపు ఉంది. అమెజాన్, వీవ్‌మార్ట్‌ లాంటి బహుళ జాతీయ కంపెనీలు ఇక్కత్‌ వస్త్రాలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నాయి. ఫలితంగా.. ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాలు, దేశాల ప్రజలకు పోచంపల్లి ఇక్కత్‌ వస్త్రాలు మరింత చేరువయ్యాయి. సినిమాలు, సీరియల్స్‌లో హీరో, హీరోయిన్లు, యాంకర్లు, పారిశ్రామిక వేత్తలు పోచంపల్లి చేనేత వస్త్రాలను అమితంగా ఇష్టపడుతున్నారు. వెండితెరపై కూడా చేనేత వస్త్రాలు కనువిందు (pochampally ikat news) చేస్తున్నాయి. ఇటీవల కాలంలో చేనేతలకు ఆదరణ పెరిగింది. ఇక...పోచంపల్లి దేశ, విదేశీయులకు అధ్యయన కేంద్రంగా మారింది. ప్రపంచం నలుమూలల నుంచి విదేశీయులు చేనేత వస్త్ర తయారీ తీరు తెన్నులు తెలుసుకోవడానికి నిత్యం వస్తుంటారు.

అమెరికా, జర్మనీ దేశాల అధ్యక్ష భవనాలలో పోచంపల్లి కర్టెన్స్‌..

ముంబయి, హైదరాబాద్, దిల్లీ, కోల్‌కతా, బెంగళూరుకు చెందిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ-నిఫ్ట్‌, బిజినెస్‌ స్కూల్‌ ఆఫ్‌ ఇండియా, పలు ఫ్యాషన్‌ టెక్నాలజీ ఆఫ్‌ ఇనిస్టిట్యూట్స్‌ స్టడీటూర్‌లో భాగంగా ఇక్కడికి వచ్చి చేనేతపై అధ్యయనం చేస్తుంటారు. చేనేతను పాఠ్యాంశంగా చేర్చడం వల్ల రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు అధ్యయనం కోసం ఇక్కడికి వస్తుంటారు. అమెరికా, జర్మనీ దేశాల అధ్యక్ష భవనాలలో పోచంపల్లి కర్టెన్స్‌ను వాడుతున్నారంటే ఇక్కడి చేనేత కార్మికుల కళా నైపుణ్యం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ముఖ్యంగా పలు దేశాల ప్రజలు ఇక్కత్‌ (pochampally ikat news) చేనేత వస్త్రాలైన డ్రెస్‌ మెటీరియల్స్, డోర్‌ కర్టెన్స్, బెడ్‌ షీట్స్‌ను ఎక్కువ కొనుగోలు చేస్తుంటారు. పోచంపల్లి హ్యాండ్లూమ్‌ పార్క్‌.. వస్త్ర ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తూ ఏటా కోట్ల రూపాయల టర్నోవర్‌ సాధిస్తోంది. పలువురు ఔత్సాహిక యువకులూ...ఆన్‌లైన్‌ వస్త్ర వ్యాపారాలు చేస్తున్నారు.

కేటీఆర్ పిలుపుతో..

వివిధ రాష్ట్రాల మంత్రులు, ఐఏఎస్‌ అధికారులు, ఫ్యాషన్, సినీరంగ ప్రముఖులు సందర్శించి చేనేతను అధ్యనం చేసి ఇక్కడి వస్త్రాలను (newbhoodan pochampally sarees speciality) కొనుగోలు చేశారు. ముఖ్యంగా జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ- ఎన్​ఐఆర్డీ (NIRD), జాతీయ సూక్ష్మ, లఘు, మధ్య తరహా పరిశ్రమల సంస్థ తదితర సంస్థల ఆధ్వర్యంలో దేశ, విదేశాలకు చెందిన ప్రతినిధులు సందర్శించారు. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమూ పోచంపల్లి వస్త్రాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుండటం వల్ల ఆదరణ మరింత పెరిగింది. మంత్రి కేటీఆర్ చేనేత వస్త్రాలు వినియోగించాలంటూ పిలుపునివ్వటం, పలువురికి చేనేత చీరలు, వస్త్రాలే కానుకలుగా ఇస్తూ సామాజిక మాధ్యమాల్లో పంచుకోవటం...బ్రాండ్ ఇమేజ్‌ను పెంచింది. పశ్చిమబంగాకు చెందిన కాంగ్రెస్ ఎంపీ మొహువ మోయిత్రా.. హైదరాబాద్‌లో పర్యటించిన సందర్భంగా...ఆమెకు చేనేత చీరను కానుకగా అందించారు మంత్రి కేటీఆర్. ట్విటర్ వేదికగా ఆమె.. పోచంపల్లి చీరలు అద్భుతమంటూ కొనియాడారు. ఇలా ప్రముఖుల ప్రశంసలూ అందుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ గ్రామం.

గ్రామానికి మహర్దశ..

ఈ గుర్తింపుతో పోచంపల్లి గ్రామానికి మహర్దశ పడుతుందని భావిస్తున్నారు అంతా. ఇప్పటికే అభివృద్ధిలో మేటి అనిపించుకుంటున్న ఈ పల్లెలో.. హస్తకళలను మరింత ప్రోత్సహించేందుకు అవకాశం దక్కినట్టైంది. అంతే కాక.. పర్యాటకంగానూ గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు వీలు కల్పించింది.. ఈ పురస్కారం. మొత్తంగా.. దేశ సాంస్కృతిక గౌరవం ఈ అవార్డుతో రెట్టింపైంది. చేనేత కళను కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేసింది.

ఇవీచూడండి:

ABOUT THE AUTHOR

...view details