యాదాద్రి ఆలయ నగరిలో అపార్ట్మెంట్లు యాదాద్రి లక్ష్మీనరసింహ క్షేత్రానికి వచ్చే భక్తుల బసకు మెరుగైన వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే యాత్రికుల కోసం సరైన సదుపాయాలు కల్పించాలన్న సీఎం కేసీఆర్ సూచనల మేరకు యాడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
కొండ కింద సుమారు 900 వందల ఎకరాల్లో యాత్రికులు బస చేయడానికి విల్లాలు కాటేజీలు నిర్మించాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఇప్పుడు 250 ఎకరాల్లోనే నిర్మించేందుకు కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఇక్కడ విశాల రహదారులు, మినీ పార్కులు, దారుల మధ్య పూల మొక్కలు ఏర్పాటు చేశారు.
విల్లాలు,కాటేజీలతోపాటు అపార్ట్మెంట్లపై యాడా దృష్టి పెట్టినట్లు సమాచారం. 2 కోట్లు, రూ 1.50 లక్షలు, 25 లక్షల విరాళాలతో నిర్మించాలనుకుని యాడా అధికారులు దాతలను ఆహ్వానించారు, విల్లాల నిర్మాణానికి 100 కోట్ల నిధులు సమకూర్చినట్లు తెలుస్తోంది. 25 లక్షలు ఇచ్చే దాతల పేరిట అపార్ట్మెంట్లు నిర్మించాలని యోచిస్తున్నారు.
యాడా రూపొందించిన నమూనా తీరులోనే విల్లాలు, కాటేజీల నిర్మాణం జరుగుతుందని యాడా వైస్ ఛైర్మన్ కిషన్రావు తెలిపారు. పనులపై అజమాయిషీ విరాళం ఇచ్చే దాతల అభిప్రాయాల ప్రకారమే కొనసాగుతుందని స్పష్టం చేశారు.
మార్పులతో కూడిన ప్రతిపాదనలను త్వరలోనే సీఎం దృష్టికి తీసుకెళ్లి అనుమతి పొందాలన్నది యాడా అభిప్రాయం. సీఎం అనుమతితో ఆలయ నగరి నిర్మాణాలకు శ్రీకారం చుట్టాలని యాడా యంత్రాంగం భావిస్తోంది.