Wife Killed Her Husband: మద్యం మత్తు ఎన్నో కుటుంబాల్లో తీరని ఆవేదనను మిగులుస్తోంది. ఓ వైపు మద్యం తాగి వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. మరోవైపు తాగిన మైకంలో విచక్షణ మరిచి కొందరు ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో సదరు వ్యక్తులు ప్రాణాలు తీసుకోవడానికి లేదా ప్రాణాలు తీయడానికి వెనుకాడటం లేదు. ఫలితంగా తమతో పాటు ఇతరుల జీవితాలను కడతేరుస్తున్నారు.
తాగి వచ్చి చిత్రహింసలు గురి చేస్తున్నాడని కట్టుకున్న భర్తను కడతేర్చింది ఓ ఇల్లాలు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పర్వతగిరి మండలం ముంజాల కుంట తండా వద్ద జాటోతూ శ్రీను అనే వ్యక్తి ఐదు రోజుల క్రితం అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టగా.. మృతుని భార్య శాంతి.. భర్తను అంతమొందించిదని దర్యాప్తులో తేలింది. ఇందుకు ఆమె ఇద్దరు పిల్లలు, మరో వ్యక్తి సహకరించారని గుర్తించారు. నిందితులు శ్రీనును హత్యచేసి.. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా చిత్రీకరించారని తెలిపారు. ఈ క్రమంలోనే నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని మామునూరు ఏసీపీ కృపాకర్ వెల్లడించారు.