తెలంగాణ

telangana

By

Published : Dec 17, 2021, 10:33 AM IST

ETV Bharat / state

Warangal IT Hub: ఐటీ హబ్‌గా మారుతున్న ఓరుగల్లు నగరం..

Warangal IT Hub: చారిత్రక నగరంగా ఖ్యాతి గడించిన వరంగల్‌ ఐటీ హబ్‌గా మారుతోంది. మడికొండలోని ఐటీ పార్క్‌లో మరో దిగ్గజ కంపెనీ జెన్‌పాక్ట్‌ ప్రారంభమవుతోంది. ఇప్పటికే సైయెంట్, టెక్ మహేంద్ర సంస్థలు నూతన ప్రాంగణాలను నిర్మించి తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. నగరంలో ఐటీ విస్తరణపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని భావిస్తున్నారు.

Warangal IT Hub
Warangal IT Hub

ఐటీ హబ్‌గా మారుతున్న ఓరుగల్లు నగరం..

Warangal IT Hub: హైదరాబాద్‌ తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన ద్వితీయ శ్రేణి నగరంగా పేరుపొందటంతో వరంగల్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలని సర్కారు సంకల్పించింది. ఇందుకు అనుగుణంగా మడికొండ శివార్లలో 27 ఎకరాల్లో ఐటీ పార్క్‌ను 2016లో అభివృద్ది చేసింది. ఇక్కడ సైయెంట్, టెక్ మహేంద్ర సంస్ధలు కొత్త కార్యాలయాలను నెలకొల్పగా... గతేడాది జనవరిలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. భవిష్యత్తులో మరిన్ని సంస్థలు ఓరుగల్లు వైపు దృష్టి సారిస్తాయని వ్యాఖ్యానించారు. మంత్రి చెప్పినట్లుగానే నూతన కార్యాలయాలు ప్రారంభించేందుకు కొన్ని సంస్థలు సన్నద్ధమవుతున్నాయి. మరో దిగ్గజ కంపెనీ జెన్‌పాక్ట్‌ వరంగల్‌లో తన సేవలు ప్రారంభించనుంది.

అన్నివిధాల సహకారం అందిస్తాం...

హైదరాబాద్‌ ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్​తో జెన్‌పాక్ట్‌ ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా వరంగల్ నగరానికి జెన్‌పాక్ట్‌ కంపెనీని కేటీఆర్​ ఆహ్వానించారు. ఐటీ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. నగరంలోని సౌకర్యాల, మానవ వనరుల కారణంగా ఐటీ కంపెనీలు ముందుకు వస్తున్నాయని... వీటన్నింటికి ప్రభుత్వం అన్నివిధాల సహకారం అందిస్తుందని వెల్లడించారు. ఇప్పటికే ఖమ్మం, కరీంనగర్‌లో ఐటీ టవర్లు ఏర్పాటుతో అనేక కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. త్వరలోనే మహబూబాబాబాద్, సిద్దిపేట, నిజామాబాద్‌లలో ఐటీ టవర్‌ పనులు పూర్తవుతాయన్నారు.

అందుకే వరంగల్​ను ఎంచుకున్నాం...

పోచారం క్యాంపస్‌కి కేవలం గంటన్నర వ్యవధి దూరంలోనే వరంగల్‌లో నూతన క్యాంపస్ తీసుకువస్తున్నామని జెన్‌పాక్ట్‌ సీఈఓ త్యాగరాజన్ తెలిపారు. ఎన్​ఐటీ సహా ఇతర ఇంజినీరింగ్ కళాశాలలు ఉన్నందునా ఐటీ పరిశ్రమ విస్తరణకు వరంగల్‌ను ఎంచుకున్నామని తెలిపారు. చారిత్రక నగరంలో అపారమైన నాణ్యమైన మానవ వనరులు ఉన్నాయన్నారు. భవిష్యత్తులో తమ కంపెనీకి వరంగల్ కీలకమైన టెక్ సెంటర్‌గా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

హర్షం వ్యక్తం చేసిన మంత్రి ఎర్రబెల్లి...

వరంగల్‌కు ఐటీ కంపెనీలు వస్తుండటంపై పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు హర్షం వ్యక్తం చేశారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలు వెళ్లాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా మంత్రి కేటీఆర్ ఆచరణ తోడవడంతో పెద్ద కంపెనీలు వరంగల్ వైపు చూస్తున్నాయని తెలిపారు.

ఇదీ చదవండి:KTR on Warangal Tech Center: 'జెన్‌పాక్ట్ రాకతో వరంగల్‌ ఐటీ మరింత బలోపేతం'

ABOUT THE AUTHOR

...view details