కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా మూడేళ్ల పాటు విధులు నిర్వహించిన ఓయూ భౌతికశాస్త్రం విశ్రాంత ఆచార్యులు ఆర్.సాయన్న పదవీకాలం గత ఏడాది జులై 25వ తేదీతో ముగిసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ బి.జనార్దన్రెడ్డిని ఇన్ఛార్జి ఉపకులపతిగా నియమించారు. రాష్ట్రంలో తొమ్మిది విశ్వద్యాలయాలకు వీసీలను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగానే వర్సీటీల పాలకమండళ్ల నియామకాలను కూడా చేపట్టి కేయూతోపాటు రాష్ట్రంలోని తొమ్మిది విశ్వవిద్యాలయాలకు వీసీ నియమించడం కోసం కసరత్తు ప్రారంభించింది. అర్హుల నుంచి రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ఉన్నత విద్యాశాఖ అధికారులు దరఖాస్తులను ఆహ్వానించారు. గత ఏడాది జులై తొమ్మిదో తేదీన నియామకాల కోసం ప్రకటన జారీ చేశారు. ఆచార్యులుగా పదేళ్ల అనుభవం ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో సర్వీస్లో ఉన్న వారితో పాటుగా విశ్రాంత ఆచార్యులు కూడా దరఖాస్తులు చేసుకున్నారు.
నోటిఫికేషన్పై నీలినీడలు!
కేయూ ఉపకులపతి నియామకం కోసం గత ఏడాది జులై 9వ తేదీన ప్రకటన జారీ అయింది. ఈ నెల 8వ తేదీతో సంవత్సరం పూర్తి అవుతుంది. ఏ ప్రకటన అయినా సంవత్సరం మాత్రమే చెల్లుబాటులో ఉంటుందని.. ఏడాది గడిస్తే నిబంధనల ప్రకారం చెల్లుబాటు కాదని సీనియర్ ఆచార్యులు వ్యాఖ్యానిస్తున్నారు. అదే నిజమైతే కేయూ ఉపకులపతి నియామకం మరింత జాప్యమయ్యే అవకాశాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని వీసీ నియామకాలను చేపట్టాలని అధ్యాపక, ఉద్యోగ, పరిశోధక, విద్యార్థివర్గాలు కోరుతున్నాయి.
నిధుల లేమితో సతమతం
విశ్వవిద్యాలయానికి సరిపోను నిధులు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రూ.89 కోట్లు ఉద్యోగుల వేతనాలకే సరిపోవడం లేదు. మరోవైపు ఉద్యోగుల వేతనాలను ఏడాదికి రూ.130 కోట్ల వరకు అవసరముంటుందని వర్సిటీ అధికారులు అంటున్నారు. నిధులు లేక అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.