తెలంగాణ

telangana

ETV Bharat / state

వరంగల్​ నిట్​లో ఉత్సాహంగా సాంకేతిక వేడుకలు

వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్​లో సాంకేతిక వేడుకలు ఉత్సాహంగా సాగుతున్నాయి. తమ మేధస్సుకు పదును పెడుతూ.. ఒ‍కరితో మరొకరు పోటీ పడుతూ.. కొత్త ఆవిష్కరణలకు తెరలేపుతూ...  విద్యార్ధులు ప్రదర్శించిన నమూనాలు అందరినీ ఆకట్టుకున్నాయి. బుల్లి రోబోల నాట్యాలు, రయ్ రయ్ మంటూ ఎగిరే విమానాలు, డ్రోన్లు... విద్యార్థుల ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి.  దేశం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థినీ, విద్యార్థులతో విద్యాసంస్థ ప్రాంగణం సందడిగా మారింది.

By

Published : Nov 2, 2019, 9:01 AM IST

వరంగల్​ నిట్​లో ఉత్సాహంగా సాంకేతిక వేడుకలు

వరంగల్​ నిట్​లో 'టెక్నోజియాన్ 2019 ఉత్సవం' ఆద్యంతం ఆలోచింపచేసేదిగా సాగుతోంది. సృజనాత్మకతకు అద్దం పట్టే విధంగా... విద్యార్థులు ప్రదర్శనలిస్తూ అందరినీ అబ్బురపరిచారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి దాదాపు 5 వేల మందికిపైగా విద్యార్థులు 55కి పైగా ఈవెంట్లలో పాల్గొని తమ ప్రతిభ పాటవాలను ప్రదర్శిస్తున్నారు. డ్రోన్ తయారీలో పలు ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తమ మేధస్సుకు పదును పెట్టి... బుల్లి డ్రోన్లను తయారు చేసి గగనతలంలో విహరింపచేశారు. దిల్లీకి చెందిన వినోఫోటెక్ కంపెనీ ఆధ్వర్వంలో నాట్యం చేసే బుల్లి రోబోలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. సెల్ ఫోన్​లో పాటలకు అనుగుణంగా రోబోలు చిందులేసి అదరహో అనిపించాయి.

గాల్లో చక్కర్లు కొట్టిన విమానాలు

'హోవర్ మానియా' పేరుతో నిర్వహించిన పోటీలు అందరిలోనూ ఆసక్తి రేపాయి. ఏవియన్ విభాగంలో ప్రదర్శించిన బుల్లి విమానాల తయారీ... ప్రదర్శన హైలెట్​గా నిలిచింది. బృందాలుగా ఏర్పడి తాము స్వయంగా తయారు చేసిన విమానాలను రిమోట్ సాయంతో గాల్లో చక్కర్లు కొట్టించి భవిష్యత్ సాంకేతిక నిపుణులనిపించుకున్నారు. ఇక ఒత్తిడిపై పని చేసే విధంగా అత్యంత తక్కువ ఖర్చుతో... రూపొందించిన వాటర్ రాకెట్లను విద్యార్థి బృందాలు తయారు చేసి...తమకు తామే సాటి అని నిరూపించుకున్నాయి. ఒకరిని మించి మరొకరన్నట్లుగా వాటర్ రాకెట్లను తయారుచేసి శాస్త్రవేత్తలను తలపించారు. సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడానికి టెక్నోజియాన్ ఓ వేదికగా నిలుస్తుందని విద్యార్థులు చెప్పారు.

ఇస్రో శాస్త్రవేత్తలకు ఉత్తరాలు

విద్యార్థులు నిర్వహించిన 'లెటర్స్ ఆప్ లవ్' కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. చంద్రయాన్-2 ప్రయోగం కొద్దిలో చేజారినా... మేమంతా మీ వెంటేనని... మున్ముందు మరిన్ని విజయాలను నమోదు చేయాలని ఆకాంక్షిస్తూ.. ఇస్రో శాస్త్రవేత్తలకు వందలాది మంది విద్యార్థులు తమ అభినందనలు తెలియచేస్తూ ఉత్తరాలు రాశారు. టెక్నోజియాన్ ముగిసిన తర్వాత ఈ ఉత్తరాలను ఇస్రో శాస్త్రవేత్తలకు పంపే విధంగా ఏర్పాటు చేశారు. ఇక 'హెల్పింగ్ హ్యాండ్స్' పేరుతో విద్యార్థులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రదర్శనలకు వచ్చే వీక్షకులు స్వచ్ఛందంగా అందించిన నగదును జమ చేసి బాలసదన్ అనే ఆశ్రమానికి అందించనున్నారు.

శభాష్​ పవన్​!

మహబూబాబాద్​ జిల్లాకు చెందిన పదవ తరగతి విద్యార్థి బానోత్ పవన్... రైతులకు ఎండా వానతో పాటు చీకట్లో ఉపయోగపడేవిధంగా సోలార్ గొడుగు రూపొందించి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇంకా కంప్యూటర్ దశ నుంచి లాప్‌టాప్, ట్యాబ్, సెల్‌ఫోన్ వరకు అభివృద్ది చెందిన పరిణామ క్రమ నమూనాలను కొంతమంది విద్యార్థులు ప్రదర్శించారు. విజ్ఞానం, వినోదం, మేళవింపుగా జరుగుతున్న టెక్నోజియాన్ 2019 ...ఆద్యంతం అందరినీ అలరిస్తోంది. ఆదివారం టెక్నోజియాన్ ముగుస్తుంది.

వరంగల్​ నిట్​లో ఉత్సాహంగా సాంకేతిక వేడుకలు

ఇవీ చూడండి: రాష్ట్రంలో మెగా ఫుడ్​ పార్కుల ఏర్పాటుపై కేంద్రం దృష్టి

ABOUT THE AUTHOR

...view details