తెలంగాణ

telangana

By

Published : Apr 20, 2022, 10:07 AM IST

ETV Bharat / state

Rahul Gandhi Telangana Tour: రాహుల్‌ సభకు కాంగ్రెస్ శ్రేణుల భారీ సన్నాహాలు

Rahul Gandhi Telangana Tour: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​గాంధీ మే6న తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు రాహుల్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హనుమకొండలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని నేతలు భావిస్తున్నారు.

Rahul Gandhi
Rahul Gandhi

Rahul Gandhi Telangana Tour: హనుమకొండలో మే 6న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ‘రైతు సంఘర్షణ సభ’ను తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. చాలాకాలం తర్వాత రాష్ట్రానికి రాహుల్‌ వస్తున్న నేపథ్యంలో.. సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. బహిరంగసభకు 5లక్షల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈవేదికగా ప్రజలను పార్టీ వైపు ఆకర్షించడంతోపాటు వచ్చే ఎన్నికలకు శ్రేణులను సన్నద్ధం చేయాలని భావిస్తోంది. ఈక్రమంలో జనసమీకరణ కోసం ముఖ్యనేతలు జిల్లాల్లో పర్యటనలు ప్రారంభించారు.

పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ మహేశ్వర్‌రెడ్డిలు మంగళవారం సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో పర్యటించి స్థానిక నేతలతో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. గురువారం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులతో సమీక్ష నిర్వహించనున్నారు. 22న రేవంత్‌, స్టార్‌క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మధుయాస్కీ, ముఖ్య నాయకులు హనుమకొండలో బహిరంగ సభాస్థలిని పరిశీలిస్తారు. అదేరోజు ఉమ్మడి వరంగల్‌ జిల్లా నాయకులతో సమావేశం నిర్వహిస్తారు. 23న గాంధీభవన్‌లో పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. జనసమీకరణ, బహిరంగ సభను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో చర్చించనున్నారు.

మహిళల్ని మోసం చేసిన తెరాస ప్రభుత్వం: భట్టి

అభయహస్తం పథకాన్ని తెరాస ప్రభుత్వం నిర్వీర్యం చేసి మహిళల్ని మోసం చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రలో భాగంగా మంగళవారం ఆయన ఖమ్మం జిల్లా మధిర, రాయపట్నంలలో జరిగిన సభల్లో మాట్లాడారు. ‘‘అభయహస్తం పథకానికి మహిళలు చెల్లించిన ప్రీమియాన్ని తిరిగి చెల్లిస్తామని మంత్రి ఎర్రబెల్లి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి ఏడాదిన్నర పూర్తయినా వారికి డబ్బులు ఇవ్వలేదు. డ్వాక్రా మహిళలకు 60ఏళ్లు దాటాక పింఛను ఇవ్వటానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకంలో.. తెలంగాణ ఏర్పాటునాటికి 2.20 లక్షల మందికి పింఛను ఇచ్చారు.

2015నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛను పథకాన్ని పెట్టి 1,33,415 మంది అభయహస్తం సభ్యులను ‘ఆసరా’లోకి మార్చింది. మిగతావారికి 2016 అక్టోబరు నుంచి అభయహస్తం పింఛను నిలిచిపోయింది’’ అని భట్టి ధ్వజమెత్తారు. రాయపట్నం బ్రిడ్జి వద్ద భట్టి పాదయాత్రకు పార్టీ సీనియర్‌ నాయకులు మధుయాస్కీగౌడ్‌, శ్రీధర్‌బాబు, మహేశ్వర్‌రెడ్డి, కేయూ విద్యార్థులు స్వాగతం పలికారు. తెదేపా, సీపీఐ నాయకులు సంఘీభావం తెలిపారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details