గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరంగల్ నగరం అతలాకుతలం అయింది. దాని నుంచి తేరుకునే లోపే మళ్లీ వర్షం పడి నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. హన్మకొండలోని పలు కాలనీలు ఇంకా వరద నీటిలోనే ఉన్నాయి. సమ్మయ్య నగర్, అమరావతి నగర్, సహకార నగర్, ద్వారక కాలనీ, సరస్వతి నగర్, సుందరయ్యనగర్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది.
వరదతో ఛిద్రమవుతున్న వరంగల్ జీవనం - వరంగల్లో వర్షం వల్ల ప్రజల కష్టాలు
కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలు వరంగల్ ప్రజల జీవనాన్ని చిన్నాభిన్నం చేశాయి. వర్షం వస్తుందంటే చాలు అక్కడి ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు నాలాలు పొంగి పొర్లుతాయో.. ఇళ్లు మునిగిపోతాయేమోనని భయపడిపోతున్నారు.
![వరదతో ఛిద్రమవుతున్న వరంగల్ జీవనం people fear about rain in warangal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8501686-514-8501686-1597996646344.jpg)
10 రోజుల నుంచి వరద నీటిలోనే ఉండిపోయామని.. కాలు కదపడానికి వీలులేక చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసర సరుకులు కొనడానికి బయటకు వచ్చేందుకు కూడా అవస్థలు పడుతున్నామని చెబుతున్నారు. డ్రైనేజీలు, నాలాలు సరిగ్గా లేకనే 10 రోజుల నుంచి వరద నీరు కాలనీలోనే ఉండిపోయిందని వాపోయారు. అసలే కరోనా విజృంభిస్తోన్న సమయంలో ఇలా వరద నీరు ఇళ్లల్లోనే ఉండటం వల్ల రోగాలు వ్యాపిస్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి:గుడారాల్లో పెరిగింది... నాయకత్వ పాఠాలు చెబుతోంది!