తెలంగాణ

telangana

ETV Bharat / state

రమ్మంటోంది ఊరు.. ఇవ్వమంటోంది పేరు - corona effect

ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి వలస కూలీలను సొంత రాష్ట్రాలకు పంపుతామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో వేలాది మంది ఎప్పుడెప్పుడు ఊరికి పోదామా అని ఎదురుచూస్తున్నారు. మంగళవారం పెద్ద సంఖ్యలో పోలీసులకు తమ పేర్లు ఇచ్చారు. సమీపంలోని పోలీసు స్టేషన్‌, చెక్‌పోస్టు వద్దకు వెళ్లి వివరాలు చెప్పారు.

migrants registering their names for trains in warangal district
రమ్మంటోంది ఊరు.. ఇవ్వమంటోంది పేరు..

By

Published : May 6, 2020, 11:43 AM IST

ఓరుగల్లులో గ్రానైట్‌, ఇటుక బట్టీలు, భవన నిర్మాణ, పత్తి మిల్లులు, వ్యవసాయం, వివిధ పరిశ్రమల్లో పనిచేసేందుకు అనేక రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో కార్మికులు వలస వచ్చారు. లాక్‌డౌన్‌ తర్వాత ఉపాధి కోల్పోవడంతో ప్రభుత్వం వారికి బియ్యం, నగదు పంపిణీ చేసింది. చాలా మంది సొంతూళ్లకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నా కరోనా వల్ల అనుమతించడం లేదు. చేసేది లేక పలువురు నడుచుకుంటూ స్వస్థలాలకు వెళ్లేందుకు విఫల యత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సర్కారు ప్రత్యేక రైళ్లను నడిపించడానికి సమాయత్తం అవుతోంది.

ప్రభుత్వం ప్రత్యేక రైళ్లను నడిపించే క్రమంలో ఒక్కో బండిలో 1200 మంది ఉండేలా చూస్తోంది. ఇందుకు అనుగుణంగా ఏ రాష్ట్రానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారనే వివరాలను అధికారులు ఆరా తీస్తున్నారు. మన వద్ద మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ వారు అధికంగా ఉన్నారు. కొందరు ఇప్పటికే తమ ప్రాంతాలకు వెళ్లిపోయారు. మిగిలిన వారి సమాచారం క్రోడీకరించి, అందరినీ ఒక చోటకు చేర్చి వైద్య పరీక్షలు నిర్వహించి తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మంగళవారం కార్మికుల పేర్లను నమోదు చేసుకున్నారు. నేరుగా ఠాణాలకు వచ్చి వివరాలిచ్చారు. ఒక్క వరంగల్‌ కమిషనరేటు పరిధిలోనే 6270 మంది తరలొచ్చారు.

ఎక్కడ ఎంత మంది?

జిల్లా వలస కార్మికులు

వరంగల్‌ అర్బన్‌ 13571

వరంగల్‌ రూరల్‌ 914

జనగామ 2445

మహబూ బాబాద్‌ 7718

భూపాల పల్లి 5888

ములుగు 10374

అనేక రాష్ట్రాల వారు...

వరంగల్‌ అర్బన్‌లో 13571 మంది వివిధ రాష్ట్రాల కార్మికులు ఉన్నట్టు అధికారులు లెక్కించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు 1276 మంది ఉండగా, అసోం, బిహార్‌, ఛత్తీస్‌గఢ్‌, దిల్లీ, గుజరాత్‌, హర్యానా, ఝార్ఖండ్‌, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఒడిశా, పంజాబ్‌, రాజస్థాన్‌, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబంగతోపాటు నేపాల్‌ దేశానికి చెందిన వారు ఉన్నారు. రూరల్‌, జనగామ, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్‌ జిల్లాల్లోనూ వందల సంఖ్యలో వివిధ పనులు చేస్తున్నారు. ఒకవైపు దరఖాస్తులు చేస్తున్నా అసలు రైలెప్పుడొస్తుందో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. రైళ్ల రాకపోకలపై అధికారులు ఎలాంటి ప్రకటనలను చేయడం లేదు.

ఇదీ చూడండి:భారత్​లో 'విద్య' కోసం అమెరికా భారీ రుణసాయం

ABOUT THE AUTHOR

...view details