తెలంగాణ

telangana

ETV Bharat / state

అసంపూర్తిగా హుజూరాబాద్​- పరకాల రహదారి.. ఐదేళ్లయినా కదలని పనులు - huzurabad parakala highway construction works

కరీంనగర్‌- భూపాలపల్లి జిల్లాలకు అనుసంధానించేందుకు నిర్మించతలపెట్టిన నాలుగు వరసల రహదారి నత్తనడకన సాగుతోంది. కోట్ల రూపాయలు నిధులు ఉన్నా గుత్తేదారు నిర్లక్ష్యం కారణంగా ఏళ్ల కొద్దీ ఎలాంటి పురోగతి లేకుండా పనులు ఉన్నాయి. హుజూరాబాద్ నుంచి పరకాల వరకు 4 వరసల రహదారి నిర్మిస్తే రవాణాపరంగా ఎంతో అభివృద్ధి జరుగుతుందని ఈ ప్రాంతవాసులు ఆశించారు. శంకుస్థాపన జరిగి అయిదేళ్లు అవుతున్నా.. పనులు మాత్రం అంతంతమాత్రమే. దీంతో ఈ రహదారిలో ప్రమాదాలు జరగడంతో పాటు తీరని నష్టం వాటిల్లుతోందని రెండు జిల్లాల ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

huzurabad parakala highway incomplete
హుజూరాబాద్​- పరకాల రహదారి పనులు

By

Published : Aug 20, 2021, 4:38 PM IST

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ నుంచి వరంగల్​ గ్రామీణ జిల్లా పరకాల వరకు నిర్మిస్తున్న నాలుగు వరసల రహదారి నిర్మాణ పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. 2016 సెప్టెంబర్‌లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఎంతో అట్టహాసంగా రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. త్వరలోనే తమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అని ఆశించిన ప్రజలకు నిరాశే మిగిలింది. రహదారి నిర్మాణం ఇంకా అసంపూర్తిగానే ఉంది. శంకుస్థాపన జరిగి అయిదేళ్లు గడుస్తున్నా నేటికీ రహదారి నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లుగా మారింది. రహదారి నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో రోడ్డు ప్రమాదాలు జరగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడక్కడ రోడ్డు వేసి నిలిపివేయడంతో పాటు నాణ్యత ప్రమాణాలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి.

నిధులున్నా..

హుజూరాబాద్‌ శివారులోని పరకాల క్రాస్‌ రోడ్డు నుంచి పరకాల వరకు నాలుగు వరసల రహదారి నిర్మాణం గత అయిదేళ్లుగా కొనసాగుతోంది. పరకాల-హుజూరాబాద్‌ 30.5 కిలోమీటర్ల నిడివి రహదారి నిర్మాణానికి రూ. 100 కోట్లు మంజూరు చేశారు. రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో ఈ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ రహదారి నిర్మాణంతో కరీంనగర్‌- వరంగల్‌ జాతీయ రహదారికి, కాళేశ్వరం జాతీయ రహదారికి అనుసంధానం కానుంది. అయితే నేటికీ ఈ రోడ్డు పూర్తిస్థాయిలో నిర్మాణానికి నోచుకోనేలేదు. అక్కడక్కడా కంకర పోసి వదిలిపెట్టారు. దీంతో ఈ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారిందని స్థానికులు వాపోతున్నారు.

ఈటల రాజేందర్​ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వరుసల రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభించి ఐదేళ్లు గడుస్తున్నా ఇంకా పూర్తి కాలేదు. ఫలితంగా రహదారిపై ప్రమాదాలు వాటిల్లుతున్నాయి. -శోభన్​ బాబు, కమలాపూర్​

30కి.మీల రహదారి పనులకు అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్​ ఆధ్వర్యంలో టెండర్లను ఆహ్వానించారు. గుత్తేదారుల నిర్లక్ష్యంతో పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. గుంతలు, కంకరరోడ్లపై ప్రయాణాలు చేయాలంటే భయంగా ఉంది. తోట సురేష్​, ఉప్పల్​ గ్రామం

ప్రమాదాలకు నిలయంగా

హుజూరాబాద్ నియోజకవర్గంలో రూ. 193 కోట్లతో రహదారుల నిర్మాణం తలపెట్టగా జమ్మికుంట- హుజూరాబాద్ రోడ్డు పూర్తయింది. దీనికి గాను రూ. 36కోట్లు వెచ్చించారు. జమ్మికుంట- వీణవంక రహదారి నిర్మాణానికి రూ. 33కోట్లు కేటాయించగా నిర్మాణపు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. హుజూరాబాద్‌- పరకాల రహదారి నిర్మాణం మాత్రం ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. కాల్వలపై వంతెనల నిర్మాణాలు పూర్తి కాలేదు. ఉప్పల్‌ రైల్వే ట్రాక్‌పై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. రహదారి మధ్యలో నిర్మించిన డివైడర్లు.. రోడ్డు పూర్తికాకముందే విరిగి పోతున్నాయి. పలుమార్లు రహదారి నిర్మాణ పనులను మొన్నటి వరకు ఉన్న వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పర్యవేక్షించారు. పనులను వేగవంతం చేయాలని ఆదేశించినప్పటికీ మార్పు రాలేదని స్థానికులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

రహదారి నిర్మాణ పనులన్నీ అసంపూర్తిగా ఉన్నాయి. ఇప్పటివరకూ ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడ పర్యవేక్షించలేదు. రోడ్లపై డివైడర్లు నాణ్యతలేక కూలిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకొని త్వరగా నాలుగు వరుసల రహదారి పనులు పూర్తి చేయాలి. -సతీశ్​బాబు, కమలాపూర్​

గుత్తేదారులు, అధికారుల అశ్రద్ధతో రహదారి నిర్మాణ పనులన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. సరైన అధికారులు లేకపోవడంతో పనుల్లో నాణ్యత లోపిస్తోంది. -ఓదెలు కమలాపూర్​

రహదారి నిర్మాణ పనులు, నాణ్యతా ప్రమాణాలను పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రమాదాలను నివారించాలని, రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని స్థానికులు కోరుతున్నారు.

అసంపూర్తిగా హుజూరాబాద్​- పరకాల రహదారి

ఇదీ చదవండి:Nellikal Lift: నెల్లికల్ ఎత్తిపోతలకు అనుమతులు వచ్చేదెప్పుడు..

ABOUT THE AUTHOR

...view details