తెలంగాణ

telangana

గుంతలెందుకు పూడ్చలేదు..? ఇంజినీర్లపై కమిషనర్‌ ఆగ్రహం

వరంగల్​ అర్బన్​ జిల్లా హన్మకొండ పట్టణంలో బల్దియా కమిషనర్​ పమేలా సత్పతి పర్యటించారు. ఈ సందర్భంగా వర్షాలకు దెబ్బతిన్న రహదారులకు మరమ్మతులు చేయకపోవడం పట్ల సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో ఇంత నిర్లక్ష్యం ఎందుకని మండిపడ్డారు.

By

Published : Sep 4, 2020, 11:32 AM IST

Published : Sep 4, 2020, 11:32 AM IST

Commissioner Pamela Satpathy was outraged at the engineers
గుంతలెందుకు పూడ్చలేదు..? ఇంజినీర్లపై కమిషనర్‌ ఆగ్రహం

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరంగల్ అర్బన్​ జిల్లా హన్మకొండలో చాలా రోడ్లు దెబ్బతిన్నాయి. మరమ్మతులు చేపట్టాలని ఆదేశించినా కదలిక లేదు. స్థానిక కొత్త బస్టాండ్‌ రోడ్డు దయనీయంగా ఉంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం కొత్త బస్టాండ్‌ కూడలి సుందరీకరణ, స్మార్ట్‌రోడ్డు నిర్మాణం, సెంటర్​లో అంతర్గత డ్రైనేజీ పనులను బల్దియా కమిషనర్‌ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారులపై ఏర్పడిన గుంతలెందుకు పూడ్చలేదని ఇంజినీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

రహదారిలో కనీసం నడిచే పరిస్థితి లేదని, మరమ్మతులు చేయడానికి నిర్లక్ష్యమెందుకని ఇంజినీర్లను ప్రశ్నించారు. స్మార్ట్‌సిటీ పథకం నిధులతో పార్కు, గ్రీనరీ పనులు నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోతన విజ్ఞాన పీఠం ఆడిటోరియంలో కొనసాగుతున్న ఆధునికీకరణ పనులు తనిఖీ చేశారు. భవన పునరుద్ధరణ, డిజిటలైజేషన్‌, ఇతర పనులు మరింత వేగవంతమవ్వాలని కోరారు.

నాలాలు పరిశీలన..

హన్మకొండ నయీంనగర్‌ నాలా ఆక్రమణల తొలగింపు, వ్యర్థాలు తొలగింపు పనులను కమిషనర్‌ పరిశీలించారు. కిషన్‌పురా, పెద్దమ్మగడ్డ, భద్రకాళి నాలాలను చూశారు. గురువారం రెండు భవనాలు కూల్చేసినట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 57 ఆక్రమణలు తీసివేశారని, 326 పాత భవనాలు తొలగించారన్నారు.

వన్‌టైం సెటిల్‌మెంట్‌పై విస్తృత ప్రచారం..

సంవత్సరాల తరబడి ఆస్తి పన్ను చెల్లించని వారు వేలాది మంది ఉన్నారు. ఇలాంటి వారి కోసం తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంచి అవకాశం కల్పించింది. పది శాతం చెల్లిస్తే 90 శాతం జరిమానా మాఫీ అవుతుందని, వన్‌ టైం సెటిల్మెంట్‌ను సద్వినియోగం చేసుకొవాలని బల్దియా కమిషనర్‌ పమేలా సత్పతి కోరారు. గురువారం మధ్యాహ్నం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఆస్తిపన్ను పాత బకాయిల వసూళ్లు, భువన్‌ యాప్‌ సర్వేపై సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆస్తిపన్ను వన్‌ టైం సెటిల్​మెంట్‌పై నగర ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని, బడా పాత బకాయిలపై దృష్టి సారించాలని కోరారు. నగరంలో రూ.2.70కోట్లు వసూలయ్యాయని, ఈ నెల 15 వరకు ప్రతి సోమ, బుధవారాల్లో కాశీబుగ్గ, కాజీపేట సర్కిల్‌ కార్యాలయాల్లో రెవెన్యూ మేళాలు నిర్వహించాలని, ఆస్తిపన్నుపై ప్రజల సందేహాలు నివృత్తి చేయాలన్నారు.

ఇదీచూడండి.. 'ఎంజీఎంలో కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం'

ABOUT THE AUTHOR

...view details