ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో చాలా రోడ్లు దెబ్బతిన్నాయి. మరమ్మతులు చేపట్టాలని ఆదేశించినా కదలిక లేదు. స్థానిక కొత్త బస్టాండ్ రోడ్డు దయనీయంగా ఉంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం కొత్త బస్టాండ్ కూడలి సుందరీకరణ, స్మార్ట్రోడ్డు నిర్మాణం, సెంటర్లో అంతర్గత డ్రైనేజీ పనులను బల్దియా కమిషనర్ పమేలా సత్పతి పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారులపై ఏర్పడిన గుంతలెందుకు పూడ్చలేదని ఇంజినీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రహదారిలో కనీసం నడిచే పరిస్థితి లేదని, మరమ్మతులు చేయడానికి నిర్లక్ష్యమెందుకని ఇంజినీర్లను ప్రశ్నించారు. స్మార్ట్సిటీ పథకం నిధులతో పార్కు, గ్రీనరీ పనులు నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పోతన విజ్ఞాన పీఠం ఆడిటోరియంలో కొనసాగుతున్న ఆధునికీకరణ పనులు తనిఖీ చేశారు. భవన పునరుద్ధరణ, డిజిటలైజేషన్, ఇతర పనులు మరింత వేగవంతమవ్వాలని కోరారు.
నాలాలు పరిశీలన..
హన్మకొండ నయీంనగర్ నాలా ఆక్రమణల తొలగింపు, వ్యర్థాలు తొలగింపు పనులను కమిషనర్ పరిశీలించారు. కిషన్పురా, పెద్దమ్మగడ్డ, భద్రకాళి నాలాలను చూశారు. గురువారం రెండు భవనాలు కూల్చేసినట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 57 ఆక్రమణలు తీసివేశారని, 326 పాత భవనాలు తొలగించారన్నారు.