BJP Unemployment March: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీని నిరసిస్తూ.. బీజేపీ చేపట్టిన 'నిరుద్యోగ మార్చ్'తో ఓరుగల్లు కాషాయమమైంది. దీనికి భారతీయ జనతా పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్రావు సహా ముఖ్య నేతలు నిరుద్యోగ మార్చ్లో పాల్గొన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం కూడలి నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు.
పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం సహా నిరుద్యోగులకు న్యాయం చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ చేపట్టాలనినాయకులు, శ్రేణులు నినదించారు. పేపర్ లీకేజీతో నష్టపోయిన నిరుద్యోగులకు లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని అన్నారు. తొలుత ఓరుగల్లులో చేపట్టిన నిరుద్యోగ మార్చ్..ఆ తర్వాత అన్ని జిల్లాల్లో నిర్వహించనున్నారు.
ర్యాలీలో పాల్గొన్న బండి సంజయ్... అన్ని పేపర్ల లీకులకూ తానే కారణమని చెబుతున్నారని ఆరోపించారు. ప్రజల సమక్షంలో సమాధానం చెప్పక తప్పదని అన్నారు. ఇంట్లో కార్యక్రమం ఉందని చెప్పినా అరెస్టు చేశారని వివరించారు. కేసీఆర్ ఇంట్లో వారంతా దందాలు చేస్తున్నారని ఆరోపించారు. టీఎస్పీఎస్సీలో తప్పు లేకుంటే సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
తప్పు చేయకపోయినా ఈటల రాజేందర్ను ముఖ్యమంత్రి బయటకు పంపారని బండి సంజయ్ ఆరోపించారు. కుమారుడు, కుమార్తెను కాపాడేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులు, యువత భవిష్యత్తు కోసం బీజేపీ పోరాడుతోందని స్పష్టం చేశారు. ఈడీ విచారణ అంటే చాలు.. అనేక సాకులు చెబుతారని విమర్శించారు. 30 లక్షల మంది యువత ఇబ్బంది పడితే సీఎం ప్రగతి భవన్ నుంచి బయటకు రాలేదని బండి సంజయ్ ఆక్షేపించారు.
ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకే నిరుద్యోగ మార్చ్: రైతులు, ఇంటర్ విద్యార్థులు, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నా.. కేసీఆర్ స్పందించరని బండి సంజయ్ విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో ముఖ్యమంత్రి యువతను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ మూర్ఖత్వ పాలన కోసమా తెలంగాణ సాధించుకున్నామని యువత ప్రశ్నిస్తోందని అన్నారు. ఎన్నికలు వస్తేనే ఉద్యోగ ప్రకటనలు ఇస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకే నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తున్నామని బండి సంజయ్ వివరించారు.