వరంగల్ జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్లో టెక్నోజీయాన్ వేడుకలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. నిత్యం పుస్తకాలతో కుస్తీ పట్టే విద్యార్థులు...నూతన ఆవిష్కరణలతో సరికొత్త ప్రయోగాలతో ఈ సాంకేతిక వేడుకల్లో పాల్గొననున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకోనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి 5 వేలకు పైగా విద్యార్థులు హాజరుకానున్నారు.
'సృజనాత్మకత... సాంకేతికత అంశాల్లో ప్రతిభను వెలికితీయాలి'
విద్యార్థులే నిర్వాహకులై అత్యంత సందడిగా జరిగే టెక్నోజీయాన్-2019 ఘనంగా ప్రారంభమైంది. నూతన ఆవిష్కరణలు అనే అంశంతో నవంబర్ 1 నుంచి 3 వరకు వరంగల్ నిట్లో జరగనున్న ఈ సాంకేతిక వేడుకలను డీఆర్డీవో విశ్రాంత కన్సల్టెంట్ పద్మశ్రీ ఎన్.దివాకర్ లాంఛనంగా ప్రారంభించారు. నిట్ సంచాలకులు ఎన్వీ రమణారావు, అడ్రోయిటిక్ సొల్యూషన్ సీఈవో ఆయుష్, విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచి సాంకేతికత, వైజ్ఞానిక అంశాల్లో ప్రతిభను వెలికితీసేందుకు ఈ వేడుకలు దోహదపడతాయని ఎన్వి రమణారావు పేర్కొన్నారు.