తెలంగాణ

telangana

Warangal Floods 2023 : వాన తగ్గినా వీడని వరద కష్టాలు.. జలదిగ్బంధంలోనే పలు గ్రామాలు

By

Published : Jul 29, 2023, 8:28 AM IST

Floods Effect in Warangal : వర్షాలు, వరద ఉద్ధృతి తగ్గినా వరంగల్‌ జిల్లాలో పలు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. వరద తగ్గినా సహాయ సహకారాలు అందక... మరికొన్ని చోట్ల బురదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చెత్తా చెదారం కొట్టుకొచ్చి... వీధులన్నీ అపరిశుభ్రంగా మారాయి. అధికారులు పునరావాస కేంద్రాలకు బాధితులను తరలించే ప్రక్రియలో నిమగ్నమయ్యారు.

Floods
Floods

వాన తగ్గినా ప్రజలను వీడని వరద కష్టాలు.. జలదిగ్బంధంలోనే పలు కాలనీలు

Floods Effect in Warangal District 2023 : వర్షాలు వరదలతో అతలాకుతలమైన వరంగల్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. బొంది వాగు వరదనీరు కారణంగా... సంతోషిమాతనగర్ గణేశ్‌నగర్, ఎన్టీఆర్​ నగర్, బీఆర్​ నగర్, రాజీవ్ నగర్, బృందావన్ కాలనీలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ అగ్నిమాపక శాఖ బోట్లతో సహాయక చర్యలు చేపట్టారు. హనుమకొండలోనూ కాలనీలు వరద నుంచి బయటపడగా... ఇళ్లలోకి చేరిన బురదతో జనం ఇక్కట్లు పడుతున్నారు.

Warangal Rains 2023 :నాలాల నుంచి కొట్టుకొచ్చిన చెత్తా చెదారంలో... వీధులన్నీ అపరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. దీంతో ఇళ్లను బాగు చేసే పనిలో నగరవాసులు పడ్డారు. గతేడాది వరదలు వచ్చినా అధికారులు చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు, వరదల కారణంగా నిలిచిన విద్యుత్ సరఫరా ఇప్పుడిప్పుడే పునరుద్ధరిస్తున్నారు. 20 కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేశారు. నగర పురపాలక సంస్ధ పరిధిలో 2,787 విద్యుత్ స్తంభాలు 450 ట్రాన్స్ ఫార్మర్లు, 140 సబ్ స్టేషన్లు నీట మునిగాయి.

'వరదలు ఇళ్లను చుట్టుముట్టడంతో పిల్లలు, పెద్దవాళ్లమందరం ఇబ్బందుల పాలయ్యాం. లోతట్టు ప్రాంతాలన్ని మునిగిపోయాయి. ఇళ్లలోని వస్తువులన్నీ తడిసిపోయాయి. రోజంతా భవనాల మీదనే ఉన్నాం. వర్షం, చలి గాలిలో అలానే నిలబడి పోయాం. తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడ్డాం. వాగు పక్కన ఉన్నామా.. చెరువు పక్కన ఉన్నామా.. అసలు సిటీలో ఉన్నామా అనిపించింది. ఇప్పుడు మాత్రం సేఫ్​గా ఉన్నాం. నిత్యావసర వస్తువులు, ఫర్నీచర్స్, విలువైన సామాగ్రి సహా అన్ని తడిసిపోయాయి. చిన్నపిల్లలు, షుగర్ పేషెంట్స్ తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడ్డారు. కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఇంత భారీ ఎత్తున వరదలు ఎప్పుడూ రాలేదు.' - వరద బాధితులు, వరంగల్ జిల్లా

వర్షాలు తగ్గుముఖం పట్టినా.. కొనసాగుతున్నా వరద ప్రవాహం :మహబూబాబాద్ జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ప్రవాహం కొనసాగుతోంది. మున్నేరు, ఆకేరు, పాలేరు, వట్టి, పాకాల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వేలాది ఎకరాల్లో బురద పేరుకొని, ఇసుక మేటలు వేశాయి. గార్ల మండలం రాంపురం గ్రామంలో సురేశ్‌ అనే వ్యక్తికి గుండెనొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లే దారిలేక రైల్వేట్రాక్ పై 2 కిలోమీటర్లు మోసుకొచ్చి మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మోరంచపల్లి గ్రామంలో ప్రాణాలతో బయటపడిన గ్రామస్తులు.. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వరద ఉద్ధృతికి గ్రామంలో నలుగురు మృతి చెందారు. మంత్రి సత్యవతి రాఠోడ్, ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి బాధిత కుటుంబసభ్యులను ఓదార్చారు.

కొనసాగుతున్న సహాయక చర్యలు :వరంగల్ జిల్లా నర్సంపేటలో వరదనీరు పెరుగుతుండడంతో బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. హనుమకొండ జిల్లా పరకాలలో వైద్యం అందక ఓ వ్యక్తి మృతి చెందాడు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రభుత్వం హెలికాప్టర్ ద్వారా ఆహార ప్యాకెట్లు, మంచినీళ్లు, మెడికల్ కిట్లు అందించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సహాయకచర్యలు చేపట్టినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు.

ఇవీ చదవండి :

ABOUT THE AUTHOR

...view details